
పన్నీరు సెల్వం
● కోర్టులో పన్నీరు సెల్వం స్పష్టీకరణ ● ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు ● తీర్పు రేపు వెలువరించే అవకాశం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి తానూ సిద్ధంగానే ఉన్నానని ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. కోర్టులో విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదులు బుధవారం వాదనలు వినిపించారు. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి శిబిరం నిర్వహించిన సర్వసభ్య సమావేశ తీర్మానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, నేతలు వైద్యలింగం, జేసీడీ ప్రభాకర్, మనోజ్ పాండియన్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ సాగింది. తొలుత పన్నీరు సెల్వం తరపున వాదనలు కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలన్నీ ఒకరి స్వలాభం కోసం మార్చేశారని కోర్టుకు వివరంచారు. ఇవన్నీ పళణి స్వామికి అనుకూలంగానే ఉన్నాయని, ఈ నిబంధనల్లో మార్పులు చేస్తే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి తానూ సిద్ధంగానే ఉన్నట్టు పన్నీరు సెల్వం కోర్టు ముందు తన న్యాయవాదుల ద్వారా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా జరగాలని, అన్నాడీఎంకేలోని కేడర్ ఓటర్ల జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. అనంతరం వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్ తరపున వాదనలు కోర్టుకు చేరాయి.
మార్గం చూపిన
సుప్రీం కోర్టు
చివరగా పళణి స్వామి తరపున వాదనలు కోర్టుకు చేరాయి. అన్నాడీఎంకే నిబంధనలను ఒక వ్యక్తి మార్చలేదని, పార్టీలోని అందరూ కలిసి కట్టుగా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేశాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులు ఎన్నికలలో పోటీ చేయకూడదనే ఉద్దేశంతోనూ నిబంధనలలో మార్పులు చేశామని వివరించారు. పన్నీరు సెల్వం మరో పార్టీని నడుపుతున్నట్లుగా, పార్టీ గతంలో నియమించిన జిల్లాల కార్యదర్శులను తొలగించి, కొత్త వాళ్లను నియమిస్తూ వస్తున్నారని, ఇది పార్టీ నిబంధనలకు విరుద్దం కాదా..? అని ప్రశ్నించారు. పార్టీ నిబంధనలలో మార్పు చట్ట విరుద్ధం కాదని వాదించారు. గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. శుక్రవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.