చైన్నెకి తెలుగింటి వంటకాలు

మాట్లాడుతున్న అరుణ్‌   - Sakshi

సాక్షి, చైన్నె: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలో అత్యుత్తమ తెలుగు వంటకాల రుచిని భోజన ప్రియులకు అందిస్తున్న వివాహ భోజనంబును చైన్నెలోకి తీసుకొచ్చారు. నుంగంబాక్కం స్టెర్లింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన అవుట్‌ లెట్‌ గురించి నిర్వాహకుడు అమిత్‌ జువ్వాడి పేర్కొంటూ రుచికరమైన తెలుగింటి వంటకాలను ఇక్కడ పరిచయం చేస్తున్నామని వివరించారు. ప్రముఖ చెఫ్‌ యాదగిరి పర్యవేక్షణలో ఇక్కడ వంటకాలను తయారు చేసి, ఎప్పటికప్పుడు భోజనప్రియులకు అందిస్తామన్నారు. ఈ అవుట్‌ లెట్‌ను నటుడు సందీప్‌ కిషన్‌ ప్రారంభించారని తెలిపారు.

స్థలాల అభివృద్ధ్యే లక్ష్యం

సాక్షి చైన్నె : వినూత్న, స్మార్ట్‌ సొల్యూషన్స్‌, అధునాతన అటోమేషన్‌ సౌకర్యాలతో ఆధునిక వాణిజ్య స్థలాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లుతున్నట్టు కాసా గ్రాండ్‌ వ్యవస్థాపకులు అరుణ్‌ తెలిపారు. మంగళవారంస్థానికంగా తమ సంస్థ నేతృత్వంలో వాణిజ్య విభాగాన్ని ఆయన ప్రకటించారు. దీని గురించి మీడియాకు వివరిస్తూ, ప్రభుత్వ సమ్మతితో రూ.8 వేల కోట్లు పెట్టుబడి చైన్నెలో పెట్టనున్నామని ప్రకటించారు. 2027 నాటికి ఆధునిక వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు.

40 సవర్ల నగల చోరీ

తిరువొత్తియూరు: చైన్నె అరుంబాక్కంలో వృద్ధురాలిని కట్టేసి చేతి వేలిని నరికి బీరువాలో ఉన్న 40 సవర్ల నగలు, రూ.80 వేల నగదును దుండగులు చోరీచేసిన దుండగులు చోరీ చేశారు. చైన్నె అరుంబాక్కంకు చెందిన గంగ (70). భర్త మృతిచెందాడు. ఈమె కుమారుడు మహాదేవన్‌ ప్రసాద్‌ (45) వద్ద ఉంటోంది. సోమవారం రాత్రి కుమారుడు, కోడలు విధులకు వెళ్లారు. గంగ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని కట్టిపడేశారు. ఆమె ధరించిన నగలు తీసుకొని తర్వాత బీరువాలో వున్న 40 సవర్ల నగలు, రూ. 80వేల నగదును చోరీ చేశారు. దీనిని అడ్డుకోడానికి ప్రయత్నించిన వృద్ధురాలు చేతి వేలును నరికి వెళ్లి పోయారు. కొంత సేపటికి ఇంటికి వచ్చిన మహదేవన్‌ ప్రసాద్‌ తల్లిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఫిర్యాదు మేరకు అన్నానగర్‌ డిప్యూటీ కమిషనర్‌ రోహిత్‌ నాథన్‌ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నారు.

రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి

తిరువొత్తియూరు: చైన్నె పుళల్‌ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. పుళల్‌ సమీపంలో ఉన్న లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన అప్పాస్వామి (74). ఇతను సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లేందుకు రెడ్‌ హిల్స్‌, లక్ష్మీపురం రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అప్పుడు వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన్ని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అప్పాస్వామిని స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పాస్వామి మృతిచెందాడు. దీనిపై మాధావరం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top