
విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న కలెక్టర్ కుమరవేల్ పాండియన్
వేలూరు: తమిళ భాషను రానున్న తరాలకు తీసుకెళ్లేందుకు యువత కంకణం కట్టుకోవాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ తెలిపారు. వేలూరు జిల్లా గుడియాత్తంలోని కేఎంజీ కళాశాలలో తమిళ భాష, తమిల్ డ్రీమ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి ప్రసంగించారు. తమిళ బాష 5 వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉందన్నారు. తొల్కాపియన్ తమిళాన్ని రాత అధికారం, పద అధికారం, అర్థ అధికారంగా వర్గీకరించారన్నారు. ఇంత ప్రాచీన మైన తమిళ భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది తమిళ బాషను మరిచి ఆంగ్లానికి మారుతున్నారని ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న తరాలు తమిళాన్ని పూర్తిగా మరిచి పోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమిళ భాషాభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ఉత్సాహ పరచడంతో పాటు వారికి వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత సెంథిల్ వేలన్, సినీ గాయకుడు యుగభారతి తదితరులు పాల్గొన్నారు.