
పెండెం జగదీశ్వర్ సాహిత్య సేవ చిరస్మరణీయం
రామగిరి(నల్లగొండ): బాల సాహితీరత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పెండెం జగదీశ్వర్ స్మారక ఆరో జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెండెం జగదీశ్వర్ సాహిత్యాన్ని ప్రతి పాఠశాలకు చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజానికి ఉందన్నారు. జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త ముంజలూరి కృష్ణకుమారికి అందజేశారు. ఈ పురస్కారం కింద రూ.5వేల నగదు, ప్రశంసా పత్రంతో ఆమెను ఘనంగా సత్కరించారు. పురస్కార గ్రహీత ముంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ.. జగదీశ్వర్ పేరిట వారి స్నేహితులు పురస్కారాన్ని ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో బాల సాహిత్యంలో విశిష్ట కృషిచేసిన రచయితలకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్వర్ మరణం బాల సాహిత్యానికి తీరని లోటని అన్నారు. డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, సృజన సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, రచయితలు పుప్పాల కృష్ణమూర్తి, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ ఉప్పల పద్మ, పెందోట సోము, దాసోజు శ్రీనివాస్, శంకర్, బాసరాజు యాదగిరి, బండారు శంకర్, శ్రవణ్ కుమార్, భీమార్జున్రెడ్డి, మాదగాని శంకరయ్య, మోత్కూరు శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేష్, ముక్కామల జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.