కారుణ్యానికి కష్టమే!
న్యాయం చేయండి...
నవంబర్ 17 నుంచి 30 వరకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ నెల 1న విధుల్లో చేరాలని చెప్పారు. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా సిద్ధం చేశారు. తీరా వెళ్తే..కాంట్రాక్ట్ పేపర్పై సంతకం చేయలేమని, పైన ఒత్తిళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం ఇంకో వ్యక్తికి ఇస్తున్నారని తెలిసింది. ఇది అన్యాయం.
– రఘుపాత్రుని ప్రియాంక, బాధితురాలు
అరసవల్లి: విద్యుత్ శాఖలో ‘పవర్’ ఉన్నోడిదే రాజ్యంలా మారింది. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబంలో భార్యకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం విషయంలో కొందరు అక్రమార్కులు విషం చిమ్ముతున్నారు. దీనికి ఊతమిస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సిఫారసు లేఖలు ఇవ్వడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం రూరల్ మండలం భైరి విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తూ పోరం విజయ్ శేఖర్ అనే ఉద్యోగి ఈ ఏడాది మే 23న గుండెపోటుతో మృతి చెందారు. ఐదేళ్ల కుమార్తెతో జీవనం కష్టంగా భావించిన మృతుడి భార్య రఘుపాత్రుని ప్రియాంక.. భర్త పనిచేసిన విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. నేరుగా విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ వద్ద మొరపెట్టుకుంది. కుటుంబ పరిస్థితులపై స్పందించిన ఆయన.. శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయ విజిలెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులో నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి కూడా సీఎండీ ఆదేశాల మేరకు గత నెలాఖరున పదవీ విరమణ చేసిన రికార్డు అసిస్టెంట్ ధనలక్ష్మి స్థానంలో ప్రియాంకను నియమించేలా చర్యలు చేపట్టారు. గత నవంబర్ 17 నుంచి 30 వరకు ప్రియాంకకు వర్క్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి విధులకు తగినట్లు వర్క్ కాంట్రాక్టును సిద్ధం చేయాలని లేబర్ కాంట్రాక్టర్కు సూచించారు. ఈ మేరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా సిద్ధమైంది. తీరా ఈ నెల 1న విధుల్లోకి చేరేందుకు విజిలెన్స్ కార్యాలయానికి వెళ్లిన ప్రియాంకకు ఉద్యోగం ఇవ్వడంపై ఇంకా స్పష్టత రాలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ఇదే ఉద్యోగం విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ పోలీసు కుటుంబసభ్యునికి ఇప్పిస్తున్నట్లు తెలియడంతో కన్నీటి పర్యంతమైంది. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సిఫారసు లేఖతో ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరేందుకు రంగం సిద్ధం చేశారని బాధితురాలు వివరించింది. దీంతో సీఎండీ ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లయ్యింది.
మరణించిన షిఫ్ట్ ఆపరేటర్ భార్యకు ఉద్యోగమివ్వాలన్న సీఎండీ
సీఎండీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేంద్రమంత్రి సిఫారసుతో మరో వ్యక్తికి ఉద్యోగమిచ్చేలా చర్యలు
చక్రం తిప్పుతున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ ఉద్యోగి
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతరత్రా సెమీ స్కిల్డ్ ఉద్యోగాలను తమవారికి కట్టబెట్టేలా సర్కిల్ విజిలెన్స్ విభాగంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఓ పోలీసు ఉద్యోగి అంతా తానై వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా రూ.3 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమాల వ్యవహారాలను నిగ్గుతేల్చాల్సిన విజిలెన్స్ విభాగంలోనే అక్రమార్కులుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చక్రం తిప్పుతున్న
విజిలెన్స్ ఉద్యోగి..!
కారుణ్యానికి కష్టమే!
కారుణ్యానికి కష్టమే!


