రైతు చూపు.. కూరగాయల వైపు
పుట్టపర్తి అర్బన్: స్వల్పకాలిక పంటలైన కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు నికలడగా ఉంటూ గిట్టుబాటు అవుతుండటమే ఇందుకు కారణం. జిల్లాలో 25,214 ఎకరాల్లో కూరగాయలు, ఆకు కూరలు, దోస, కళింగర, పూల తోటలు సాగుచేస్తున్నారు. ఇందులో అత్యధికంగా టమాట 20,463 ఎకరాల్లో పెట్టారు. వంకాయ 651 ఎకరాలు, అనప 540, ఆలూ 320, ఎండు మిరప 725, పచ్చి మిరప 620, చిక్కుడు 156, ఉల్లి 432, ఇతర కూరగాయలు 1,307 ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే జిల్లా వాసులకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో బాగేపల్లి, డీ క్రాస్, మదనపల్లి, బెంగళూరు, చైన్నె, అనంతపురం తదితర మార్కెట్లలో కూరగాయలు విక్రయిస్తున్నారు. హిందూపురం, కదిరి, గోరంట్ల , ధర్మవరం వంటి ప్రాంతాల్లో మార్కెట్లు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు.
నిలకడగా ధరలు
సాధారణంగా కూరగాయల ధరలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. అయితే కొద్ది రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు నిలకడగా ఉంటున్నాయి. 13 కిలోల టమాట బాక్సు రూ.350 – 450, వంకాయ 10 కిలోల సంచి రూ.150, ఆలూ 50 కిలోల బస్తా సుమారు రూ.1550, అనపకాయలు కిలో రూ.50, చిక్కుడు కిలో రూ.40, పచ్చి మిరప కిలో రూ.35, ఎండు మిర్చి టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేలు, ఉల్లి 50 కిలోల బస్తా రూ.750 వరకు పలుకుతున్నాయి. ఉల్లి ధరలు మాత్రం పతనమయ్యాయి. సాధారణంగా సాగు చేసే వేరుశనగ, మొక్కజొన్న, కంది, వరి పంటల కంటే కూరగాయల సాగు మేలని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
మార్కెట్లో నిలకడగా ధరలు
సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు
జిల్లాలో 25,214 ఎకరాల్లో వివిధ రకాల తోటలు


