
చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం
అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా టోర్నీలో భాగంగా రెండో రౌండ్లో చిత్తూరు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో చిత్తూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు సాధించింది. జట్టులో సీఆర్ జ్ఞానేశ్వర్ 118 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 108 పరుగులు, బి.అభిషేక్రెడ్డి 128 బంతుల్లో 16 ఫోర్లతో 116 పరుగులు, ఏవీ సూర్య 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వైఎస్సార్ కడప జట్టు 14.5 ఓవర్లలో 94 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. వర్షం రావడంతో మ్యాచ్ను రద్దు చేసి రెండు జట్లకు సమాన పాయింట్లు కేటాయించారు. కాగా, రెండో రౌండ్ మ్యాచ్ల్లో చిత్తూరు జట్టు గణనీయమైన పాయింట్లు దక్కించుకోవడంతో అగ్రస్థానానికి ఎగబాకింది.
● కర్నూలు – నెల్లూరు జిల్లా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నయీముల్లా 86 బంతుల్లో 58 పరుగులు, ఎస్కే కమరుద్దీన్ 26 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 25.1 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆరు వికెట్లు నష్టపోయింది. కె.నిఖిలేశ్వర రెడ్డి 38 పరుగులు, శోభన వర్మ 19 పరుగులు, రోషన్ పవన్ 40 పరుగులు సాధించారు. వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం నెల్లూరు జట్టు గెలుపొందినట్లు ప్రకటించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం: రోజు యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను కలెక్టర్తో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఔత్సాహికులతో కలసి మంత్రి యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి దరిచేరదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రమంతటా యోగా దినోత్సవాలను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు. అంతకుముందు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీడిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లు
బెళుగుప్ప: మండలలోని జీడిపల్లి రిజర్వాయర్తో పాటు పరివాహక ప్రాంతంలోని కోనంపల్లి గ్రామంలో పంటలు, నీటి వినియోగాన్ని ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు. ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ట్రైనీ కలెక్టర్లు సచిన్రహర్, నరేంద్ర పాడల్, పృథ్వీరాజ్కుమార్, సందీప్ రఘువంశీ, నాగ వెంకటసహిత్, పర్హిన్ జాహిద్, మనీషా బుధవారం జీడిపల్లి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ అనిల్కుమార్ స్వాగతించారు. కోనంపల్లి వద్ద బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ పంటకు నీటి వినియోగంపై డ్రిప్, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. జీడిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన అంశాలను హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజాస్వరూప్, ఈఈ శ్రీనివాసులు వివరించారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్ అధికారి కృష్ణతేజ, ఎంఐఓ మల్లేష్, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు.

చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం

చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం