
విత్తన వేరుశనగ నాణ్యతపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: వచ్చే ఖరీఫ్లో రైతులకు పంపిణీ చేయడానికి నాణ్యమైన విత్తన వేరుశనగ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న విత్తన వేరుశనగ సేకరణ, సరఫరాకు సంబంధించి టెండర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ నుంచి వచ్చిన ఏడీఏ రమణమూర్తి, ఏవో సుకుమార్ గత రెండు రోజులుగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 10 ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించి అక్కడున్న వేరుశనగ కాయల నాణ్యతను పరిశీలించారు. టెండర్లు ఖరారు కాగానే నిబంధనల మేరకు నాణ్యమైన విత్తన వేరుశనగను సరఫరా చేయాల్సి ఉంటుందని నిర్వాహకులకు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా, పంపిణీ ఉంటుందని, నెలాఖరు నాటికి సేకరణ ధరలు ఖరారు కానున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్స్) కింద జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తన కేటాయింపులు, 50 శాతం సబ్సిడీ ప్రకటించినట్లు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
చిలమత్తూరు: వడ్డిచెన్నంపల్లికి చెందిన పవిత్ర (24) అనే వివాహిత శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో డీటీ జగన్నాథ, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెకు 15 నెలల కుమారుడు ఉన్నాడు.
కలుపు తొలగించబోయి.. కానరాని లోకాలకు
అమరాపురం: కాచికుంట గ్రామానికి చెందిన మంజునాథ (31) శనివారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రైతు ఈరన్న పొలంలో వక్క చెట్ల నడుమ పిచ్చి మొక్కలు తొలగించడానికి ట్రాక్టర్తో పాటు రోటావేటర్ తీసుకెళ్లాడు. కలుపు మొక్కలను తొలగిస్తుండగా అకస్మాత్తుగా కిందపడగానే ట్రాక్టర్ టైరు ఎక్కింది. దీంతో మంజునాథ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఇషాక్బాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విత్తన వేరుశనగ నాణ్యతపై దృష్టి