
పుట్టపర్తి: ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. మొదటి సంవత్సరం, రెండోసంవత్సరం రెండింటిలోనూ పైచేయి సాధించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులు ఫలితాలు విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 9,878 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 5,769 మంది విద్యార్థులు (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 7,447 మంది విద్యార్థులు హాజరుకాగా, 5,653 మంది విద్యార్థులు (76 శాతం) జయకేతనం ఎగురవేశారు. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు 20 స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 13వ స్థానం దక్కింది.
బాలికల హవా..
మొదటి సంవత్సరం ఫలితాల్లో 5,249 మంది బాలికలకు గాను 63 శాతంతో 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,629 మంది బాలురకు గాను 53 శాతంతో 2,442 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 4,186 మంది బాలికలను గాను 80 శాతంతో 3,350 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,269 మంది బాలురకు గాను 71 శాతంతో 2,303 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ఫలితాల్లో బాలికలే ముందు వరసలో ఉన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 777 మంది బాలికలకు గాను 66 శాతంతో 448 మంది ఉత్తీర్ణులయ్యారు. 580 మంది బాలురకు గాను 39 శాతంతో 226 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 502 మంది బాలికలను గాను 84 శాతంతో 420 మంది ఉత్తీర్ణత సాధించారు. 351 మంది బాలురకు గాను 58 శాతంతో 202 మంది ఉత్తీర్ణత సాధించారు.
మే 24 నుంచి
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 దాకా జరుగుతాయి. రోజూ రెండు విడతలుగా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. ప్రాక్టికల్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఈనెల 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ విద్య అధికారి రఘునాథరెడ్డి, ఆర్ఐఓ సురేష్ తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, స్కానింగ్ కాపీ కోసం ఈనెల 18 నుంచి 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన
అమ్మాయిలు
మొదటి సంవత్సరంలో
జిల్లాకు 20వ స్థానం
ద్వితీయ సంవత్సరంలో 13వ స్థానం
మొదటి సంవత్సరంలో 58 శాతం,
ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత
మే 24 నుంచి జూన్ 1 దాకా
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు
ఫీజు చెల్లింపు
