
నెల్లూరు రొట్టెల పండగలో కల్తీ మద్యం విక్రయాలకు స్కెచ్
కందుకూరు: గుడ్లూరు కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు వీరాంజనేయులు కూటమి పార్టీల నేతలు, పెద్దలతోపాటు ఎకై ్సజ్ అధికారుల అండదండలతోనే చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా తయారీ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీలో ఉన్న రేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరాంజనేయులు నకిలీ మద్యం తయారీ గట్టును రట్టు చేయాల్సి వచ్చినట్లు సమాచారం.
వ్యసనాలకు బానిసై..
నకిలీ మద్యం తయారు చేస్తూ ఎకై ్సజ్ శాఖ అధికారులకు పట్టుబడిన వీరాంజనేయులుది సొంత ఊరు గుడ్లూరు. అక్కడి స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడితో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. స్థానికంగా పేకాట శిబిరాలు నిర్వహించడంలో సదరు అధికార పార్టీ నేత సిద్ధహస్తుడు. ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇద్దరూ కూడా పేకాట ఆడేవారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భారీగా డబ్బులు పొగొట్టుకున్నట్లు సమాచారం. అందులో నష్టపోయిన డబ్బును సంపాదించడానికి నకిలీ మద్యం తయారీ చేసే అడ్డ దారిని ఎంచుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం తయారీకి గుడ్లూరులోని మిట్టపాళెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మెషిన్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశాడు. శనివారం చేసిన దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్తో పాటు, 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుల్స్ బయట పడ్డాయి.
ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందా?
వీరాంజనేయులు గుడ్లూరులో చాలా కాలం నుంచి భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బాహాటంగానే మద్యం షాపులతోపాటు, బెల్టు షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తుంటే.. ఎకై ్సజ్ అధికారులకు కానీ, అధికార పార్టీ నేతలకు కానీ తెలియదంటే నమ్మక శక్యంగా లేదని పలువురు అంటున్నారు. కూటమి పార్టీల పెద్దల అండదండలు లేకపోతే నకిలీ మద్యం తయారీ చేయలేడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం ఉంది. అధికార పార్టీ నేతల సూచనలతోపాటు మామూళ్ల మత్తులో పడి వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కల్తీ మద్యం తయారీ నిందితుడు వీరాంజనేయులుకు అధికారులు దాడుల చేయనున్న సమాచారం ముందే అందడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని ఓ ఆటో ద్వారా తరలించినట్లు తెలుస్తోంది.
ఇలా దొరికాడు
ఇటీవల ఎకై ్సజ్ శాఖ అధికారులు బాపట్ల జిల్లా రేపల్లిలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి చేసి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాడు. అక్కడి కేసులో ఉన్న నిందితుడే వీరాంజనేయులకు కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్ సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు వీరాంజనేయులను అతని సెల్ఫోన్ డేటా ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరాంజనేయులు పేరుతో నెల్లూరుకు చెందిన మరో వ్యక్తి సిమ్ కార్డు ఉపయోగిస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వీరాంజనేయులు పట్టుబడినట్లు సమాచారం.
చాలా కాలంగా వీరాంజనేయులు ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ పేరుతో కల్తీ మద్యాన్ని తయారు చేసి రూ.100లకే మద్యం, బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇదే మద్యాన్ని షాపులు, బెల్టు షాపుల్లో రూ.160లకు విక్రయిస్తున్నారు. ఇలా కొన్ని వేల బాటిల్స్ను వీరాంజనేయులు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే బెల్టు షాపులకు సరఫరా విషయంలో మద్యం షాపుల యజమానులకు, వీరాంజనేయులకు మధ్య తేడా రావడంతో కొంత కాలంగా మద్యం తయారీని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతున్న నేపథ్యంలో కల్తీ మద్యాన్ని భారీగా తయారు చేసి విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీని కోసం నెల్లూరుకు చెందిన మరో వ్యక్తితో కలిసి రొట్టెల పండగకు కేటాయించే దుకాణాల్లో ఒకటి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కార్గోలో 400 లీటర్ల స్పిరిట్ తెప్పించాడు. ఇందులో ప్రస్తుతం 300 లీటర్ల ఒరిజినల్ స్పిరిట్ను అధికారులు స్వాధీనం చేసుకోగా, మరో 100 లీటర్ల మిక్స్డ్ స్పిరిట్ ఉన్నట్లు గుర్తించారు.