
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం
● పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు
● అసంపూర్తిగా తరగతి గదులు,
టాయిలెట్స్ నిర్మాణాలు
● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్స్ కిట్స్
● యూనిఫాం, బూట్లు, సాక్స్లు పెండింగ్
● 9 వేలకు పైగా బ్యాగుల కొరత
● చాలా పాఠశాలల్లో పనిచేయని
ఆర్వో ప్లాంట్లు
● ఉపాధ్యాయుల దృష్టంతా బదిలీల పైనే
● పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు
నెల్లూరు (టౌన్): వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు, అసంపూర్తి భవనాలు, పని చేయని మినరల్ వాటర్ ప్లాంట్లు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతోంది. పాఠశాలలకు దాదాపు 50 రోజులు వేసవి సెలవులిచ్చినా.. ఆయా పాఠశాలల్లో పెండింగ్లను పూర్తి చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. మరో వైపు జిల్లాకు పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ కిట్స్ రాలేదు. ఇంకో వైపు టీచర్ల బదిలీలు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ ఎప్పటికో పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల పునః ప్రారంభం రోజే విద్యార్థులందరికీ విద్యాకానుకను అందించేవారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి సిద్ధం చేసిన పరిస్థితి ఉండేది.