
మీడియాపై దాడి హేయమైన చర్య
నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పత్రిక రంగంపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, మరి ముఖ్యంగా సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం 44వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో ఏనాడూ ఇలాంటి దారుణ ఘటనలు జరగలేదని, పత్రికా రంగాన్ని స్వేచ్ఛగా బతికేలా చేశారన్నారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇద్దరూ సాక్షి మీడియాపై తమ అక్కసు వెళ్లగక్కడం సరైన పద్ధతి కాదన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయగలుగుతారన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని, యువత అందరూ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని అందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం యువతను మోసం చేయడమేనన్నారు.