
పొట్టకూటి కోసం వచ్చి..
● మినీలారీ, మిల్లర్ మధ్య నలిగిన ప్రాణం
సీతారామపురం: పొట్టకూటి కోసం వచ్చిన బండారు సురేష్ (27) అనే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలొదిలిన ఘటన సీతారామపురం బస్టాండ్ సెంటర్లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బస్టాండ్ సెంటర్లో గల కేరళ ఇంగ్లిష్ మీడియం స్కూల్ స్లాబ్ పనుల నిమిత్తం బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం గ్రామ వడ్డెరాజు నగర్ ప్రాంతం నుంచి కూలీల బృందం మినీలారీలో కాంక్రీట్ మిల్లర్తో సహా చేరుకుంది. కూలీలు కిందకు దిగి కాంక్రీట్ మిల్లర్ను పాఠశాల ఆవరణలోకి ర్యాంప్ పైనుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సాధ్యపడలేదు. సురేష్ కర్ర సాయంతో మినీలారీ చేత మిల్లర్ను నెట్టించే క్రమంలో కర్ర కాస్తా విరిగిపోయింది. దీంతో మిల్లర్ను పైకి లాగుతున్న కూలీలు ఒక్కసారిగా దాన్ని వదిలేయడంతో వేగంగా వెనక్కు వచ్చింది. ఈ క్రమంలో మిల్లర్, మినీలారీ మధ్య సురేష్ నలిగిపోయాడు. సహచర కూలీలు అతి కష్టంపై క్షతగాత్రుడిని బయటకు తీసి 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించే లోపు మార్గమధ్యలో కురప్రల్లి వద్దకు వచ్చేసరికి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరికి తరలించారు.