
కలిగిరిలో ప్రేమజంటపై దాడి
● యువకుడికి గాయాలు
కలిగిరి: మండలంలోని కలిగిరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సాయి, పూజిత వీఆర్ లా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. యువతికి వేరే వ్యక్తితో వివాహం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి, పూజిత స్నేహితుల సహకారంతో బైరవకోనకు వెళ్లి వివాహం చేసుకున్నారు. తిరిగి నెల్లూరుకు కారులో బయలుదేరారు. కలిగిరిలో టీ తాగేందుకు ఆగారు. వారిని మోటార్బైక్లపై యువతి బంధువులు వెంబడించారు. ఈ క్రమంలో పూజితను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. సాయి అడ్డుకోవడంతో వారు దాడి చేసి గాయపరిచారు. హైస్కూల్లో క్రికెట్ ఆడుతున్న యువకులు, స్థానికులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. పోలీసులు ప్రేమజంటను స్టేషన్కు తీసుకెళ్లి మాట్లాడారు.