కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు | - | Sakshi
Sakshi News home page

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

Jun 10 2025 6:54 AM | Updated on Jun 10 2025 6:54 AM

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

నెల్లూరు (లీగల్‌): నెల్లూరు ఐదో అదనపు (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమమహేశ్వర్‌రెడ్డి రెండు గంటల పాటు వాదనలను సోమవారం వినిపించారు. పోలీసుల తరఫున స్పెషల్‌ పీపీ విజయమ్మ హాజరయ్యారు. రిటర్న్‌ ఆర్గ్యుమెంట్స్‌ను ఫైల్‌ చేసి తమ వాదనలను వినిపించేందుకు వాయిదా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ఇన్‌చార్జి న్యాయమూర్తి సుమ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

రిమాండ్‌ పొడిగింపు

కాకాణిపై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు సోమవారంతో ముగిసింది. జైలు అధికారులు వర్చువల్‌గా ఆయన్ను హాజరుపర్చారు. రిమాండ్‌లో ఈ నెల 23 వరకు ఉంచాల్సిందిగా ఉత్తర్వులను ఇన్‌చార్జి న్యాయమూర్తి సుమ జారీ చేశారు. ఆయన్ను తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేశారు.

మాన్యువల్‌

కౌన్సెలింగ్‌కు డిమాండ్‌

నెల్లూరు (టౌన్‌): ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌నే నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయ ఎదుట రిలే దీక్షలను సోమవారం నిర్వహించిన అనంతరం పలువురు మాట్లాడారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా అనేక సమస్యలొస్తున్నాయని, దీనిపై విద్యాశాఖ కమిషనర్‌ ఎవరి మాట వినడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులను బెదిరింపులకు గురిచేసి ఆప్షన్లు పెట్టించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పిచ్చిబాబు, అనిల్‌కుమార్‌, చలపతిశర్మ, నరసింహులు, హజరత్తయ్య, కృష్ణారెడ్డి, మధుసూదన్‌రావు, శివశంకర్‌రెడ్డి, పద్మజ, రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

లా పీహెచ్‌డీ ఎంట్రన్స్‌లో

ఐదో ర్యాంక్‌

నెల్లూరు (టౌన్‌): ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లా పీహెచ్‌డీ ఎంట్రన్స్‌లో 76 మార్కులతో ఐదో ర్యాంక్‌ను నగరానికి చెందిన సనాతన భారత్‌ సాధించారు. లాకు సంబంధించిన నేషనల్‌ ఎలిజిబుల్టీ టెస్ట్‌ (నెట్‌)లో 92 శాతం, ఏపీ, తెలంగాణ స్టేట్‌ ఎలిజిబుల్టీ టెస్ట్‌లో అర్హత సాధించారు. జిల్లా కోర్టు, సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. ప్రస్తుతం ఏఓఆర్‌ లా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

సోషల్‌ వెల్ఫేర్‌

సూపరింటెండెంట్‌ సరెండర్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ లూకాస్‌ను తాడేపల్లి డైరెక్టర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఎదుర్కొంటున్న పలు ఆరోపణల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు రావడం చర్చనీయాంశమైంది.

రైతులను నట్టేట

ముంచిన ధాన్యం దళారి

మనుబోలు: మాయమాటలు చెప్పి అధిక ధరలకు ధాన్యం కొనుగోలు చేసిన ఓ దళారి ఆ తర్వాత పత్తాలేకుండాపోయారు. బాధితుల వివరాల మేరకు.. వెంకటాచలం మండలం పూడిపర్తికి చెందిన రామారావు, తాటిపర్తిపాళేనికి చెందిన పెంచలయ్య ఎక్కువ ధర చెల్లిస్తామని నమ్మబలికి సుమారు 600 పుట్ల ధాన్యాన్ని సేకరించారు. మండలంలోని చెర్లోపల్లి, జట్ల కొండూరు, మడమనూరుకు చెందిన పలువురి నుంచి ధాన్యం సేకరించారు. ఆపై వీరు ఆఽ దాన్యాన్ని వెంకటాచలం మండలం ఎర్రగుంటకు చెందిన దళారి వేముల శీనయ్యకు విక్రయించారు. రైతులకు రూ.90 లక్షలకుపైగా నగదు రావాల్సి ఉండగా, కాలయాపన చేస్తూ వచ్చారు. 20 రోజులు గా అందుబాటులో లేకపోవడంతో మోసపోయా మని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement