Rohit Sharma: తీవ్ర ఉత్కంఠ.. ఓవర్కు 10 పరుగులు కావాలి.. అయినా అతడు భయపడలేదు
Published
Mon, Aug 29 2022 10:20 AM
Asia Cup 2022 India Vs Pakistan- Rohit Sharma Comments: ‘‘మ్యాచ్ సగం ముగిసేటప్పటికీ కూడా విజయం మాదేనని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా గెలుపు మమ్మల్నే వరిస్తుందని నమ్మాం. మా మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి అలాంటప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి కదా’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం(ఆగష్టు 28)న జరిగిన మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖర్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టి జట్టుకు విజయం అందించాడు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ బదులు తీర్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
మ్యాచ్ చాలెంజింగ్గా సాగిందని.. అయితే, అన్ని విజయాల మాదిరే దీనిని కూడా పరిగణనిస్తామే తప్ప ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇక పేసర్లు మెరుగ్గా రాణించారని.. పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. ఇక ఈ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా గురించి రోహిత్ మాట్లాడుతూ.. జట్టులోకి పునరాగమనం చేసిన నాటి నుంచి అతడు ఆడుతున్న తీరు అమోఘమంటూ ప్రశంసలు కురిపించాడు.
ఆటకు విరామం ఇచ్చిన సమయంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన పాండ్యా.. ఇప్పుడు 140 ప్లస్ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని... బ్యాటింగ్లోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడని కొనియాడాడు. బ్యాట్తోనూ.. బంతితోనూ అద్భుతం చేశాడని, పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు అమలు చేస్తున్నాడని పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘‘తీవ్ర ఉత్కంఠ రేపిన లక్ష్య ఛేదనలో.. ఓవర్కు 10 పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొన్న తరుణంలో.. ఎవరైనా కాస్త తడబడతారు.. భయపడతారు.. కానీ హార్దిక్ అసలు అలాంటి భయాందోళనలకు గురికాకుండా పక్కాగా తన ప్లాన్ను అమలు చేశాడు’’ అని రోహిత్ శర్మ.. ఈ స్టార్ ఆల్రౌండర్ ఆట తీరును ఆకాశానికెత్తాడు.