పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌

Jun 28 2025 7:28 AM | Updated on Jun 28 2025 7:28 AM

పీజీ

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌

సిద్దిపేటఎడ్యుకేషన్‌: కెమిస్ట్రీ సబ్జెక్ట్‌తో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫార్మా రంగంలో మంచి అవకాశాలున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో కెమిస్ట్రీ పీజీ ఎంట్రెన్స్‌ రాయనున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీధర్‌లు మాట్లాడారు. పీజీలో కెమిస్ట్రీని ఎంచుకుని, శిక్షణా తరగతులను ఉపయోగించుకుని వివిధ యూనివర్సిటీల్లో పీజీ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. పీజీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఉచిత శిక్షణపై ఆసక్తిగల విద్యార్థులు కన్వీనర్‌ డాక్టర్‌ మనోహర్‌ను కలిసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, సీఓఈ డాక్టర్‌ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఈనెలాఖరు వరకు

బియ్యం పంపిణీ

సిద్దిపేటరూరల్‌: రేషన్‌ బియ్యాన్ని ఈనెల 30వ తేదీవరకు అందించనున్నట్లు అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్‌ తీసుకోని లబ్ధిదారులు వెంటనే అందుబాటులో రేషన్‌ షాప్‌నకు వెళ్లి తీసుకెళ్లాలన్నారు. పూర్తి స్థాయిలో బియ్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90 శాతం పంపిణీ పూర్తయిందని, మొత్తంగా 2,98,985 రేషన్‌కార్డులు ఉండగా, నేటికి 2,67,875 కార్డుదారులకు 16,739 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. రేషన్‌ డీలర్లు సమయపాలన పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్రమలకు తావివ్వకుండా బియ్యం పంపిణీ చేయాలన్నారు.

యాక్టివాపై సుదీర్ఘ ప్రయాణం

సిద్దిపేటజోన్‌: యాక్టివా బైక్‌తో 6300 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన సిద్దిపేట యువకుడిని శుక్రవారం వాసవీ క్లబ్‌ ప్రతినిధులు సన్మానించారు. స్థానిక శివాజీనగర్‌కు చెందిన శివకుమార్‌ 23 రోజుల పాటు ద్విచక్ర వాహనంపై లడక్‌ వరకు పర్యటించి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా శివకుమార్‌ను పట్టణ వాసవీ క్లబ్‌ ప్రతినిధులు నవీన్‌ కుమార్‌, శివకుమార్‌ హరికిరణ్‌, మంజుల, ధనలక్ష్మి ఘనంగా సన్మానించారు.

బడుల తనిఖీకి

ప్రత్యేక యంత్రాంగం

నారాయణఖేడ్‌: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్‌ చేశారు. ఖేడ్‌లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్‌స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్‌, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, కార్యదర్శులు నరేశ్‌, ఏశప్ప, హరిసింగ్‌, ఉపాధ్యక్షులు కాశీనాథ్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్షయపై అవగాహన అవసరం

హుస్నాబాద్‌రూరల్‌: గ్రామీణులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలని ఇంఫాక్ట్‌ ప్రాజెక్టు టీబీ అలర్టు ఇండియా ప్రతినిధి శ్రీనివాస్‌ సూచించారు. పట్టణంలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు బ్యాక్టీరియా గాలిలో కలిసి మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి, శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అక్కన్నపేట, హుస్నాబాద్‌ మండలాల ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌ 
1
1/2

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌ 
2
2/2

పీజీ ఎంట్రెన్స్‌కు ఉచిత కోచింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement