
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేటజోన్: జిల్లాలో స్పెషల్ గ్రేడ్ సిద్దిపేట మున్సిపాలిటీలో 2023–24 సంవత్సరానికి అధికారులు రూ.124.54కోట్ల అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అధ్యక్షతన సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హాజరయ్యారు. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.108.93కోట్ల సవరణ బడ్జెట్కను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఆదాయ, వ్యయ అంచనాలకు అనుగుణంగా రూ.2.27 లక్షల మిగులు బడ్జెట్గా పొందుపరిచారు.
బడ్జెట్ ఇలా..
బల్దియా ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల ద్వారా రూ.21.47 కోట్లు, పన్నేతరులతో రూ.29.26 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ రూపంలో రూ.26.40 కోట్లు, ప్రణాళికలు, ప్రణాళికేతర గ్రాంట్ల కింద రూ.47.40కోట్ల ఆదాయ అంచనా వేశారు. చార్జ్డ్ వ్యయం (ఉద్యోగుల వేతనాలు) కింద రూ.32.79కోట్లు, నిర్వహణ వ్యయంగా రూ.47.40కోట్లు ఇతరత్రా వ్యయ అంచనాలతో ప్రతిపాదిత బడ్జెట్ను పొందుపరిచారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.3.28కోట్ల వ్యయ అంచనా దీనిని రూపొందించారు. గతేడాది రూ.116.15కోట్లు కాగా, రూ.108.93కోట్లుగా సవరించిన బడ్జెట్ను ఆమోదించిన విషయం తెలిసిందే.
అగ్రగామిగా నిలపాలి
సిద్దిపేట మున్సిపాలిటీని ఉత్తమ బల్దియాగా నిలిపేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో చెత్త ద్వారా బల్దియాకు ఆదాయం రావడంపై అభినందించారు. సిద్దిపేట అభివృద్ధితో పాటు విలీన గ్రామాల్లో ప్రగతి అవసరమని, దీని కోసం 1/3 నిధులను బడ్జెట్లో కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు ముందుచూపుతో సిద్దిపేట బల్దియాకు చుట్టూ వాటర్ రింగ్ ఏర్పాటుతో మున్సిపాలిటీకి రూ.7 కోట్ల ఆదాయం మిగులుగా ఉందన్నారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ పెట్టాలనే సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని అన్నారు. పట్టణంలో మొక్కలు నాటే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని, అక్రమ కట్టడాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఆయా వార్డు కౌన్సిలర్లు పలు సమస్యలను కౌన్సిల్ దష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు వంగ రేణుక, కొండం కవిత, పూర్ణిమ, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, వరాల కవిత, నజియా, తస్లీమ్ బేగం, జయ, శోభారాణి, సాకి బాల్ లక్ష్మి, సుందర్, లక్ష్మణ్, మల్లికార్జున్, వినోద్, విజయేంద్ర, రియాజ్, బ్రహ్మం, సాయి, నాగరాజు, విఠోభ, సతీష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
మిగులు రూ.2.27లక్షలు
ఏకగ్రీవ ఆమోదం తెలిపిన సభ్యులు
హాజరైన కలెక్టర్, అదనపు కలెక్టర్