
ఈఏపీసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా
జిన్నారం (పటాన్చెరు): తెలంగాణ ఇంజనీరింగ్,అగ్రిల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిన్నారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన 10మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్.మహేశ్ అనే విద్యార్థి 67.82 మార్కులతో రాష్ట్రస్థాయిలో 8,518 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.
692 ర్యాంక్ సాధించిన హారిక
జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన జి.హారిక్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. పోతిరెడ్డిపల్లికి చెందిన గాండ్ల శ్రీనివాస్రెడ్డి కుమార్తె హారికకు తెలంగాణ స్టేట్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 95% మార్కులు వచ్చాయి. అత్యుత్తమ ప్రతభ చూపి 692 ర్యాంక్ సాధించింది. మంచి ర్యాంక్ సాధించడంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సైన్యానికి మద్దతుగాసంఘీభావ ర్యాలీ
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న దేశ సైనికుల ధైర్యసాహసాలను బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ కొనియాడారు. దేశ సైనికులకు సంఘీభావంగా ఆదివారం మండలంలోని ఆత్మకూర్లో గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో గల బసవేశ్వర విగ్రహం వద్ద జాతీయగీతంతో మానవహారాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ...దేశం కోసం వీరోచితంగా పోరాడుతున్న వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. యుద్ధంలో మృతి చెందిన అమరజవాన్లకు, ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన టూరిస్టులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో యువకులు సుభాష్, శ్రీనివాస్,సిద్ధప్ప, మోహన్ సింగ్, శ్రవణ్ పాల్గొన్నారు.
ఎఫ్ఆర్ఎస్లో 16 నుంచి
మామిడి పండ్ల ప్రదర్శన
సంగారెడ్డి: సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం (ఎఫ్ఆర్ఎస్)లో ఈ నెల 16,17 తేదీల్లో మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎఫ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మామిడితోటల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరవుతారని, జిల్లాలోని రైతులు పాల్గొని పండ్ల తోటల పెంపకం గురించి తెలుకోవాలని కోరారు.
సైన్యానికి మద్దతుగా నిలుద్దాం
ఎంపీ రఘునందన్రావు
దుబ్బాక: ఆపరేషన్ సిందూర్తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు పాక్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. దేశరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా పనిచేస్తున్నారన్నారు. దేశరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి మనమంతా అండగా ఉందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్రెడ్డి, ప్రవీణ్కుమార్ ఉన్నారు.

ఈఏపీసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా

ఈఏపీసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా

ఈఏపీసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా