
అసైన్డ్ భూములు కబ్జా
హద్దులు ఏర్పాటు చేయాలి
మా ఎస్సీలకు వైదేరు కుంట కింద 2.20 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. కొద్ది రోజులు కుంట నీరుతో పంటలు సాగు చేసిన కరువుతో తూములు కూలిపోవడంతో నీటి కాల్వలు, అలుగును ధ్వంసం చేయడంతో మాకు నీళ్లు లేకుండా పోయాయి. కుంట కట్టను ధ్వంసం చేసి మా భూమిని ఆక్రమించే రైతులపై చర్యలు తీసుకోవాలి.
– మేదిని వెంకటస్వామి, గాంధీనగర్
కుంట కట్ట గొలుసు వరకు బఫర్ జోనే..
చెరువు, కుంట కట్టల కింద గొలుసు వరకు బంఫర్ జోన్ భూములే ఉంటాయి. వీటిని ఎవరు చదును చేయరాదు, ఆక్రమించరాదు. వైదేరు కుంట కట్ట ధ్వంసం చేసిన విషయం విచారణ జరిపి వాహనాలను స్వాధీనం చేసుకొని రైతు పై కేసు నమోదు చేయిస్తాం. శిఖం, నీటి కాల్వలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్, ఏఈ ఇరిగేషన్
● మీర్జాపూర్, తోటపల్లి శివారు సరిహద్దులో రైతుల ఆక్రమణలు
● కుంట కట్టలు ధ్వంసం, నీటి కాల్వలు పూడ్చివేతలు
● పూడికతీత పనులు చేపడితేనే మేలు
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సమీప రైతులు ఆక్రమణలకు పాల్పడుతూ ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల భూములకు సాగు నీరు సౌకర్యం లేకపోవడంతో పంటలు వేయక బీడు వారడంతో ఇదే ఇదునుగా భావించిన రైతులు హద్దు రాళ్లు జరిపి ఆక్రమిస్తున్నారు.
కరువుతో సాగుకు దూరం
తోటపల్లి రెవెన్యూ పరిధిలో వైదేరు కుంట దగ్గర పేదలకు 2.20 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. ఒకప్పుడు కుంట తూము పారకంతో పంటలు పండించిన రైతులు కరువుతో కుంటలు ఎండిపోవడంతో సాగు చేయలేకపోతున్నారు. పేదలకు ఇచ్చిన భూమిలో చెట్లను అమ్ముకోవడం, గెట్టు జరిపి భూమి కలుపుకోవడం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూ సర్వే చేసి పేదల భూములకు హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కుంట కట్టలు ధ్వంసం..
హుస్నాబాద్ మండలంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయడానికి గొలుసు కట్టు కుంటలు, చెరువులను నిర్మించారు. ఇవి పూడికతో నిండిపోవడంతో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక పనులు చేయించి చెరువు, కుంటలకు పూర్వ వైభవం తీసుకొచ్చి ంది. చిన్న నీటి కుంటలను సమీప రైతులు కట్టలను ధ్వంసం చేసి బఫర్ జోన్ గొలుసు భూమిని ఆక్రమిస్తున్నారు. శుక్రవారం మీర్జాపూర్, తోటపల్లి శివారు సరిహద్దు లోని వైదేరు కుంట కట్టను ఓ రైతు ధ్వంసం చేసి చదును చేయడంతో పొరుగు రైతులు అడ్డుకొని ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు జేసీబీ, డోజర్ తాళాలు తీసుకొని వెళ్లిపోయారు. తోటపల్లిలో మాసాని కుంట, ఎర్ర కుంట, వట్టే కుంట, మీర్జాపూర్లోని మంచీళ్ల కుంట శిఖం భూములను రైతులు ఆక్రమించి చదును చేస్తున్నారు. 20 చెరువులు, కుంటలకు ఒక ఏఈని ఇరిగేషన్ అధికారులు నియమించినా అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు.

అసైన్డ్ భూములు కబ్జా

అసైన్డ్ భూములు కబ్జా