
● పల్లె, పట్టణ ప్రగతిలో అద్భుత ఫలితాలు
● ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
● 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రదానం
సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రజా ప్రతినిధులు, అధికారుల సమష్టి కషితోనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం కులబ్గూర్లోని జీఆర్కే ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీ అవార్డుల(2021–22) ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఉత్తమ పంచాయతీ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 17 పంచాయతీలు తొమ్మిది కేటగిరీల్లో 27 అవార్డులు అందుకోవడం హర్షణీయమన్నారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఇంటింటికీ తాగు నీరు వస్తుందని, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ప్రధానమంత్రి సంసద్ యోజన పథకంలో తెలంగాణ నుంచి పది ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏ నిధులైనా నేరుగా పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి డిపో నుంచి శ్రీశైల దేవస్థానానికి నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఆర్ఎం సుదర్శన్, డిపో మేనేజర్ ఉపేందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న గ్రామాలివే..
ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై న గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాల సర్పంచ్లకు మంత్రి హరీశ్రావు అవార్డులు అందజేశారు. ఎంపికై న గ్రామాల్లో కంకోల్, చిక్మద్దూర్, గొంగ్లూర్, నిజాంపేట్, చిట్కుల్, కర్దనూర్, హరిదాస్పూర్, జానకంపేట, సజ్జాపూర్, ఎద్దు మైలారం, కోనాపూర్, ఫసల్వాది, మొగుడంపల్లి, బొంతపల్లి, హుస్సేల్లి, కొడకంచి, హరిదాస్పూర్ ఉన్నాయి.

సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్రావు