సిరిసిల్లఅర్బన్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఆదివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ వర్తింపజేయాలి
సిరిసిల్లటౌన్: చేనేత, పవర్లూమ్ కార్మికులకూ రుణమాఫీ వర్తింపజేయాలని పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి కోరారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడాన్ని, నేతన్నలకు పని కల్పించడంలో స్వయం సహాయక సభ్యులకు ప్రతి ఒక్కరికి జత చీరలను ఇవ్వాలని నిర్ణయిండాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వస్త్రపరిశ్రమకు చెందిన మార్కెట్లోని ఒడిదుడుకుల ఫలితంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. నేతకార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. నాయకులు అజ్జవేణు, నల్ల చంద్రమౌళి, రాయమల్లు, రాజు పాల్గొన్నారు.
డే కేర్ సెంటర్ అప్పగించాలి
సిరిసిల్లకల్చరల్: జిల్లాలోని వృద్ధుల సంరక్షణార్థం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఆల్ సీనియర్ సిటిజెన్స్ సంఘం ప్రతిఽనిధులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను ఆది వారం కలిసి వినతిపత్రం అందజేశారు. వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీనియర్ సిటిజన్లకు అప్పగించిన పక్షంలో పూర్తి న్యాయం జరుగుతుందని సంఘం బాధ్యులు చేపూరి బుచ్చయ్య, జనపాల శంకరయ్య పేర్కొన్నారు. ఏనుగుల ఎల్లయ్య, దొంత దేవదాస్, గౌరిశెట్టి ఆనందం, వికృతి ముత్తయ్య, దశరథం, శ్రీహరి పాల్గొన్నారు.
భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి
సిరిసిల్లటౌన్: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. ఆలయ ఈవో మారుతీ రావును కలిసి ఆలయంలో సుప్రభాత సేవలు ఉదయాన్నే చేయాలని, దీంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమితి ఉపాధ్యక్షుడు చీకోటి అనిల్కుమార్, కోశాధికారి చిప్ప దేవదాసు, శ్రీరాములు పాల్గొన్నారు.
బొట్టుపెట్టి డబ్బులు డిమాండ్
వేములవాడ: రాజన్న భక్తులపై కొందరు దాడిచేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, భక్తులు తెలిపిన వివరాలు. హైదరాబాద్కు చెందిన భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం సన్నిధికి చేరుకుంటుండగా ఆలయ ఆవరణలో కొందరు బొట్టు పెట్టేవారు గుంపులుగా చేరుకున్నారు. ఒక వృద్ధురాలు బొట్టు పెట్టినందుకు సదరు భక్తులు ముందుగా రూ.5 ఇవ్వగా.. తానేమీ అడుక్కోవడం లేదని గొడవకు దిగింది. వెంటనే మరో రూ.10 తీసి ఇవ్వగా.. అక్కడే ఉన్న మిగతా బొట్టు పెట్టేవారు చేరుకొని భక్తులపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. కోర్టు చుట్టూ తిరుగుతారా అంటూ సమాధానం వచ్చిందని.. చేసేదేమి లేక ప్రథమ చికిత్స చేయించుకొని హైదరాబాద్కు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికై నా ఆలయ భద్రత సిబ్బంది అలాంటి వారిని కట్టడి చేసి భక్తులకు రక్షణ కల్పించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళి
శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళి