
క్షయ పరీక్షలు చేయించుకోవాలి
ఒంగోలు టౌన్: 60 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా క్షయ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్లో టీబీ ముక్త్ భారత్ అవగాహన ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 1,12,817 మందిని పరీక్షలు చేయగా వారిలో 5,432 మంది అనుమానితులుగా గుర్తించారని తెలిపారు. వారిలో 137 మందికి క్షయవ్యాధి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన మందులను అందించారన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించుకోవాలని, కుటుంబంలో ఎవరికై నా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే క్షయ నివారణ మందులను మింగించి క్షయ వ్యాధి నుంచి విముక్తం కావాలన్నారు. తూర్పునాయడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా క్షయ అధికారి డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
తడిసిన పొగాకునూ కొనుగోలు చేయండి ●
● కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బర్లీ పొగాకు రైతుల వినతి
మద్దిపాడు: మూడు రకాల పొగాకు గ్రేడులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, వర్షానికి తడిసి నల్లబడిన పొగాకును కూడా కొనుగోలు చేస్తేనే తాము తక్కువ నష్టాలతో బయట పడతామని బర్లీ పొగాకు రైతులు కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలోని బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులతో పొగాకు పంట ఎన్ని ఎకరాల్లో వేశారు? పంట దిగుబడి ఎంత వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలు అడిగారు. ఈక్రమంలో నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతులు పలువురు నాల్గవ గ్రేడు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను కోరగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఏఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

క్షయ పరీక్షలు చేయించుకోవాలి