
పేపర్ మిల్లు పునరుద్ధరణపై సమావేశం
జయపురం: స్థానిక గగణాపూర్లోని సేవా పేపరు మిల్లు పునరుద్ధరణపై జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన ఒక సమావేశాన్ని పట్టణంలోని రుతురాజ్ కల్యాణ మండప ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిల్లు పునః ప్రారంభించేందుకు పెట్టుబడులు పెట్టనున్న నూతన యాజమాన్యం త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సంసిద్ధత ప్రకటించిందన్నారు. మిల్లులో ఉత్పత్తి సజావుగా జరిపేందుకు రెండు యూనియన్ల కార్మికులతో చర్చలు జరిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్సర్ అనే పెట్టుబడులు పెట్టే కంపెనీకి మిల్లు నడిపేందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈనెల 25 నాటికి రాష్ట్ర ప్రభుత్వంతో నూతన యాజమాన్యం ఎంవోయూ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కార్మికులకు గత 10 నెలల బకాయి వేతనాలు చెల్లించడంతో జూలై నుంచి అందరికీ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంట్రాక్టర్ల ప్రతినిధి నరేంద్ర మహంతి, లాడి శ్రీనివాసరావు, 4వ నంబర్ యూనియన్ ప్రదీప్ కుమార్ రాయ్, సందీప్ మండల్, సునీల్ సాహు, ఉపేంద్ర జెన, 3వ నంబర్ యూనియన్ అధ్యక్షుడు ఉజ్విన్ నాయిక్, ఉమాశంకర పాణిగ్రహి, సుదర్శన సెట్టి తదితరులు పాల్గొన్నారు.

పేపర్ మిల్లు పునరుద్ధరణపై సమావేశం