
ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలోని ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన ఉండాలని, ఆయా నియోజకవర్గాల బలాలు, బలహీనతల విశ్లేషణ ద్వారా, వృద్ధికి అవకాశమున్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులకు సూచించారు. జిల్లా, నియోజకవర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళికలపై కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారులు, ప్రణాళికల రూపకల్పన బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు దోహదం చేస్తాయన్నారు. ఆయా నియోజకవర్గాల జీసీడీపీతో పాటు నియోజకవర్గ స్థూల విలువ జోడింపు, తలసరి ఆదాయాలను పెంచేందుకు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం దార్శనిక ప్రణాళికల లక్ష్యమని స్పష్టం చేశారు.
లక్ష్యం ఇదే..
ప్రస్తుతం ఉన్న రూ. 3.52 లక్షల జిల్లా తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ.55 లక్షలకు చేర్చాలనేది లక్ష్యమని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణ, ఉద్యాన, ఆక్వా కల్చర్, పరిశ్రమలు తదితరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని సూచించారు. బంగారు కుటుంబానికి పీ4తో ఉన్నత భవిష్యత్తును నిర్మిద్దామని అధికారులకు సూచించారు. సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ