
ముందుకు సాగని రెవెన్యూ పనులు
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ పనులు ముందకు సాగడంలేదు. చిన్న చిన్న పనుల నుంచి ఇంటి నిర్మాణ అనుమతుల వరకు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బల్దియా చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని నగరవాసులు వాపోతున్నారు. పర్మినెంట్ డిప్యూటీ కమిషనర్ లేకపోవడంతో ఫైళ్లకు మోక్షం కలగడం లేదు. వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్ ఉండగా, పరిశీలించేవారు లేరు. ఇన్చార్జి డీసీగా జయకుమార్కు బాధ్యతలు అప్పగించినా, ఆయన శానిటరీ విభాగానికి చెందిన అధికారి కావడం, రెవెన్యూపై పట్టు లేకపోవడంతో పనులు ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఇద్దరు ఆర్వోలున్నా పనులకు అంతరాయం..
కార్పొరేషన్కు రెవెన్యూ విభాగం ప్రధాన ఆదాయ వనరు. గత కొన్ని నెలలుగా ఈ విభాగం సుప్తావస్థలో ఉంది. సరియైన అధికారిని నియమించలేరు. డీసీగా రాజేంద్రకుమార్ రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరు రాలేదు. ఇద్దరు ఆర్వోలున్నా పనుల్లో ముందడగు పడటంలేదు. గత డిసెంబర్ నెల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. ఆస్తిపన్నుల వసూళ్లలో బిజీగా ఉన్న అధికారులు ఇతర పనులపై పెద్దగా శ్రద్ధ వహించలేదు. పాత ఇంటిని తొలగించి నూతన ఇంటి నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తులే ఎక్కువ. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు కూడా ముందుకు సాగడం లేదు. ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించడం. రెండు డిమాండ్ నోటీసులు ఇవ్వడం, ఆస్తిపన్ను చెల్లించినా ఇప్పటికీ ఆన్లైన్లో డ్యూ చూపించడం వంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. శిథిలావస్థలోని ఇళ్లు, నివాస యోగ్యంలేని ఇళ్లకు సైతం డిమాండ్ నోటీసులు ఇచ్చారు. వెకెంట్ లాండ్ టాక్స్లకు సంబంధించి పన్ను చెల్లిస్తామన్న బల్దియాలోని రెవెన్యూ సిబ్బంది తీసుకోవడం లేదని కొందరు వాపోతున్నారు. కొత్త కాలనీవాసులకు ఇంటినెంబర్ కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తుచేసుకున్న కనెక్షన్ ఇవ్వడానికి సిబ్బంది ముందుకు రావడం లేదు. ట్రేడ్లైసెన్స్ల జారీలో కూడా తీవ్ర జాప్యం సాగుతోంది. నగరంలో ఐదంతస్తుల భవనాన్ని మొదటి అంతస్తు కమర్షియల్గా చూపిస్తూ.. మిగతా వాటిని రెసిడెన్షియల్గా చూపిస్తూ బల్దియా ఆదాయానికి కొందరు అధికారులు గండికొడుతున్నారు. ఆస్తిపన్నుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత సమయంలో అనుమతులు ఇస్తే సంబంధిత పన్నులు చెల్లిస్తారు. అనుమతుల్లో జాప్యం కారణంగా బల్దియాకు వచ్చే ఆదాయం రాకుండా పోతోంది. బల్దియాలో డీసీ స్థాయి రెవెన్యూ అధికారి లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది, ఆపరేటర్లు, సహాయకులు దళారులు అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శివారు గ్రామాల సమస్యలే ఎక్కువ
కార్పొరేషన్లో విలీనమైన విలీన గ్రామాల్లోని ప్రజలకు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ముబారక్నగర్, గూపన్పల్లి, బోర్గాం (పి), పాంగ్రా, సారంగపూర్ గ్రామస్తులకు చెందిన సమస్యలు ఎక్కువగా పెండింగ్లో ఉంటున్నాయి.
ట్రేడ్ లైసెన్సులు, మ్యుటేషన్ల
జారీలో జాప్యం
కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
వందల సంఖ్యలో పైళ్ల పెండింగ్..!
దళారులుగా కిందిస్థాయి సిబ్బంది
బల్దియా ఆదాయానికి గండి
సమస్యలకు చెక్ పెడతాం
కార్పొరేషన్కు డిప్యూటీ కమిషనర్ నియామకమయ్యారు. పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. సమ స్యలుంటే నా దృష్టికి తీసుకురావాలి. దళారులను నమ్మవద్దు.
– దిలీప్కుమార్, బల్దియా కమిషనర్

ముందుకు సాగని రెవెన్యూ పనులు