
స్వగ్రామానికి చేరిన మృతదేహం
నర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం దుబాయ్లోని అబుదాబి వెళ్లిన మండలంలోని టెంబుర్నికి చెందిన బొగుడమీది సంతోష్ వారం రోజుల్లోపే మృతిచెందాడు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బొగుడమీది సంతోష్ (36) గతనెల 22న విజిట్ వీసాపై దుబాయ్లోని అబుదాబి వెళ్లాడు. మరుసటి రోజు బయటికి వెళ్లి తిని వస్తానని చెప్పి గదికి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని తోటి కార్మికులు గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ యూఏఈ ప్రతినిధి గడ్చంద నరేందర్కు సమాచారం అందించారు. ఆయన అబుదాబిలోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. బాధిత వ్యక్తి విజిట్ వీసాపై వెళ్లి ఉండటంతో కంపెనీ వివరాలు సత్వరమే తెలియరాలేదు. అక్కడి గల్ఫ్ వెల్ఫేర్ ప్రతినిధులు ఆరాతీయగా గతనెల 27న మృతి చెందినట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు తెల్లకల్లు సేవించడం అలవాటు ఉన్న సంతోష్ అబుదాబి వెళ్లాక అది లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి మృతి చెందినట్లు తెలిపారు. ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి సంఘ ప్రతినిధులు శంకర్ లావుడ్యా, అబుదాబి సమన్వయకర్త కల్లెడ నరేశ్ ఆ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరగా కుటుంబసభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య ప్రేమల, కుమారుడు సాయి చరణ్, కూతురు నితీక్ష ఉన్నారు.
గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టాలి
గ్రామీణులకు ఆశ చూపి మంచి వేతనంతో అవకాశం కల్పిస్తామని గల్ఫ్ దేశాలకు విజిట్, టూరిస్ట్ వీసాలపై పంపుతూ ఏజెంట్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని యూఏఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం ప్రతినిధులు గడ్చంద నరేందర్, శంకర్, వంశీ గౌడ్, రవి, నరేశ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో చేసే ఉద్యోగం పట్ల ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వెళ్లాలని సూచించారు.

స్వగ్రామానికి చేరిన మృతదేహం