
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్రూరల్:ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారుతారని తెలిపారు. బోధనా నైపుణ్యాలు మెరుగుపడితే పఠన, లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలు విద్యార్థుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. పాఠశాల దశ నుండే విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్నారు. శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రామారావు, అధికారులు వి.నర్సయ్య, లింబాద్రి, డీఆర్పీలు, జిల్లా ఉపాధ్యాయ శిక్షణ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కూడా శిక్షణ తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన డీఆర్పీలను సన్మానించారు.