
యథేచ్ఛగా దోచేస్తున్నారు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
పేరుతో ఇసుక అక్రమ రవాణా
● ప్రభుత్వ ఆదాయానికి గండి
● అధికారుల పర్యవేక్షణ కరువు
ఽదన్వాడ: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డ్డూ అదుపులేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొందరు అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని హమీ ఇవ్వడంతో ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ముఖ్యంగా మండలంలోని గోటూర్ గ్రామ పక్కన ఉన్న కోయిల్సాగర్ వాగు నుంచి వారం రోజులుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోటూర్ గ్రామంలో 35 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో ధన్వాడ మండలానికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఉట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఇసుక రీచ్కు అనుమతి ఇచ్చింది. కానీ అది గ్రామానికి దూరం అవుతుందని పక్కనే కోయిల్సాగర్ వాగు నుంచి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వాలని లబ్ధిదారులు, గ్రామస్తులు అధికారులను కోరారు. దీంతో తహసీల్దార్ సింధుజా, ఎంపీడీఓ సాయి ప్రకాష్ రోజుకు 4 నుంచి 5 ట్రిప్పులు ఇసుక తరలించేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఇక రెచ్చిపోతున్నారు. ఇసుకను ఇళ్లకు తరలిస్తున్నట్లు చెబుతూ మండలంలోని కిష్టాపూర్, రాంకిష్టాయిపల్లి గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తులకు ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా దాదాపు 16 ట్రాక్టర్లు ఏర్పాటు చేసి జేసీబీలతో ఇసుకను తవ్వి రోజు 100 ట్రిప్పుల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండిపడుతుంది. అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా మాముళ్లు మత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

యథేచ్ఛగా దోచేస్తున్నారు