
ధరణిలో దేవుళ్లు
పోయే చూపును తెప్పించాం
కోడుమూరు మండలం వలుకూరుకు చెందిన హనుమన్న (48) 2009లో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చింది. ఒక కన్ను పూర్తిగా దెబ్బతినగా మరో కంటికి గాయం కారణంగా శుక్లం వచ్చి చూపు మందగించింది. అతనికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర చికిత్స అందించి ప్రాణం పోశాం. ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు 13 సార్లు దశల వారీగా ఆపరేషన్ చేసి ఛిద్రమైన ముఖాన్ని బాగు చేశారు. తర్వాత ఒక కన్ను కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ బతుకుతున్న అతన్ని ఆసుపత్రికి తీసుకురాగా శస్త్రచికిత్స చేసి చూపు తెప్పించాం. దీంతో అతడు భిక్షాటన మానేసి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు.
– డాక్టర్ పి.సుధాకర్రావు, కంటి వైద్యనిపుణులు, కర్నూలు
ఆమె ధైర్యం, స్థైర్యానికి హ్యాట్సాఫ్
వైద్యులుగా ఎంతో మందికి చికిత్స చేస్తూనే రోగులు చేసే ప్రయాణంలో సహచరులుగా నిలుస్తున్నాం. ఒక రోగి క్లిష్టమైన దశలను దాటి కోలుకున్నప్పుడు వారి ముఖంలో కనిపించే చిరునవ్వు మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. ఆశలు లేవనుకుంటున్న ఓ వితంతువు స్ల్కెరోడెర్మా అనే వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం, జీవించాలనే తపన ఆమెను ముందుకు నడిపించాయి. ఆమెకు మేము అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేసుకుంటూ పిల్లలకు, కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. – డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత వ్యాధి నిపుణులు, కర్నూలు
● నమ్మకమే వైద్యులకు పునాది
● పెద్దాసుపత్రిలో అన్ని రకాల
ఆధునిక సేవలు
● కార్పొరేట్ ఆసుపత్రుల రాకతో
మెరుగైన వైద్య సేవలు
● హైదరాబాద్కు ధీటుగా
సేవలందిస్తున్న కర్నూలు వైద్యులు
● నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
కర్నూలు(హాస్పిటల్): వైద్యో నారాయణ హరీః. అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది వీరే. రోగుల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా ఎంతో మంది వైద్యులు పడుతున్న కష్టం వర్ణణాతీతం. ఇంజినీర్లు పెద్ద పెద్ద పరికరాలతో కుస్తీ పడుతుండగా వైద్యులు మాత్రం అతి సూక్ష్మంగా కనిపించే అవయవాలు, కణాలు, రక్తనాళాలను సైతం ఒడిసిపట్టి చికిత్స చేస్తూ ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఆత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు, సౌకర్యాల వల్ల ఎంతో క్లిష్టమైన చికిత్సలు కూడా సులభంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్తో సమానంగా కర్నూలులోనూ వైద్యులు అరుదైన చికిత్సలతో సత్తా చూపుతున్నారు.
పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 36కు పైగా విభాగాలున్నాయి. 1956లో 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఈ బోధనాసుపత్రి ఇప్పుడు 250 సీట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఏకై క సువిశాలమైన ఈ ఆసుపత్రికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గాక అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, రాయచోటి, ప్రకాశం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధిక సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటుగా ఎన్ని ఆసుపత్రులు వచ్చినా ఓపీ రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 2 వేలకు పైగా రోగులు ఓపీ చికిత్స పొందుతున్నారు. నిత్యం అడ్మిషన్లో ఉన్న వెయ్యి నుంచి 1200 వరకు రోగులకు సేవలు అందుతున్నాయి.

ధరణిలో దేవుళ్లు

ధరణిలో దేవుళ్లు