ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్‌ఈలు | - | Sakshi
Sakshi News home page

ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్‌ఈలు

Jun 23 2025 6:53 AM | Updated on Jun 23 2025 6:53 AM

ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్‌ఈలు

ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్‌ఈలు

నల్లగొండ: నల్లగొండ విద్యుత్‌ శాఖలో వింత వ్యవహారం కొనసాగుతోంది. ట్రాన్స్‌కోలో ఇద్దరు ఎస్‌ఈలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకరికి పదోన్నతి ఇచ్చి ఎస్‌ఈగా నియమించింది. ఆ తర్వాత పదోన్నతి తొలగించి మరో వ్యక్తిని బదిలీ చేసింది. దాంతో మొదటి అధికారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని అదే సీటులో కూర్చొగా బదిలీపై వచ్చిన అధికారి కూడా పక్క రూమ్‌లో సీటు వేసుకుని మరో ఎస్‌ఈగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర సీఈ పరిధిలో ఉన్నప్పటికీ పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక పోస్టులో ఇద్దరు ఎస్‌ఈలు కొనసాగుతున్నారు.

అసలేం జరిగిందంటే..

ట్రాన్స్‌కోలో నల్లగొండ డీఈగా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు పీహెచ్‌సీ ఆర్థో కోటాలో ప్రభుత్వం 2022 నవంబర్‌లో ఎస్‌ఈగా పదోన్నతి కల్పించింది. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన పదోన్నతిలో పొరపాటు జరిగిందని అది పీహెచ్‌సీ హెచ్‌హెచ్‌కు ఇవ్వాల్సిందని హరిప్రసాద్‌కు ఇచ్చిన పదోన్నతిని ఆ శాఖ అధికారులు 2024 ఆగస్టు 14న రద్దు చేశారు. దీన్ని సవాలు చేస్తు హరిప్రసాద్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుని ఎస్‌ఈగా కొనసాగుతున్నారు. అయితే హరిప్రసాద్‌ పదోన్నతిని రద్దుచేసిన వెంటనే నల్లగొండ ట్రాన్స్‌కో ఎస్‌ఈగా కె.నారాయణరెడ్డిని నల్లగొండకు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల్లో చేరినప్పటికీ ఎస్‌ఈ కుర్చీలో కూర్చొలేని పరిస్థితి. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న హరిప్రసాద్‌ సీట్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో బదిలీపై వచ్చిన నారాయణరెడ్డి పక్క గదిలో ప్రత్యేక కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు.

ఫ విధుల్లో ఉండేది మాత్రం ఒక్కరే..

ఫ మరొకరు సంతకం పెట్టి జీతం తీసుకుంటున్న వైనం

ఫ పట్టించుకోని ఉన్నతాధికారులు

ఫ నల్లగొండ విద్యుత్‌ శాఖలో వింత వ్యవహారం

పది నెలలుగా ఇదే పరిస్థితి..

పది నెలల నుంచి ట్రాన్స్‌కోలో వింత పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌కో ఎస్‌ఈగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. అయితేన హరిప్రసాద్‌ నేరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, ఇతర అన్ని ఫైళ్లను ఆయనే చూస్తుండగా పదోన్నతిపై వచ్చిన నారాయణరెడ్డి మాత్రం పది నెలల నుంచి కేవలం విధుల వస్తూ సంతకం పెట్టి వేతనం తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయమై ట్రాన్స్‌కో సీఈ లతను వివరణ కోరగా ఈ అంశం నా పరిధిలో లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement