
జడ్జిని కలిసిన కలెక్టర్
నాగర్కర్నూల్ క్రైం: ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డి.రమాకాంత్ను బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తికి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు కొంతసేపు సమావేశమై జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిపాలన, న్యాయ వ్యవస్థ సమన్వయం, సహకారంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందించేలా కృషి జరగాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు
కందనూలు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్, డీవైఎస్ఓ సీతారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఎంపికలు ఉంటాయన్నారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 30వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డీవైఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో కలశాభిషేకం
బిజినేపల్లి: జ్యేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో పలువురు దంపతులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో కలశాభిషేకాలు చేశారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్రెడ్డి, కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ, కృష్ణారెడ్డి, జక్పారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, మట్పూరి నాగేశ్వర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు
రద్దుచేసే వరకు పోరాటం
కల్వకుర్తి రూరల్: కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు అన్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి మండల విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా లేబర్ కోడ్లను తీసుకురావడమే కాకుండా వివిధ రంగాల కేంద్ర పథకాలకు బడ్జెట్లో కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సైతం బడ్జెట్ తగ్గించడం బాధాకరమన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం జూలై 9న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో ఆంజనేయులు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నిర్మల, లక్ష్మి, అన్నపూర్ణ, యాదమ్మ, సువర్ణ, పర్వీన్, సాయమ్మ, అలివేల పాల్గొన్నారు.

జడ్జిని కలిసిన కలెక్టర్

జడ్జిని కలిసిన కలెక్టర్