ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 5 2025 12:50 AM | Updated on Mar 5 2025 12:47 AM

జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న 13,454 మంది విద్యార్థులు

అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం

సకాలంలో చేరుకోవాలి..

జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాం. విద్యార్థులు హడావుడిగా కాకుండా.. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలి.

– వెంకటరమణ, డీఐఈఓ

కందనూలు: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 13,454 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 4,899 మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,578 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,576 మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,401 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని నియమించారు. విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

25 మంది చొప్పున సీటింగ్‌..

పరీక్ష కేంద్రంలోని ఒక్కో గదిలో 25మంది విద్యార్థుల చొప్పున కూర్చునే విధంగా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండ్‌ంట్‌, ఒక డిపార్టుమెంట్‌ అధికారి, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రానికి పోలీస్‌స్టేషన్‌ నుంచి తీసుకువచ్చే ప్రశ్నపత్రాల సీల్‌ తీయడం మొదలుకుని.. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్‌ చేసే వరకు సీసీ కెమెరాల నిఘాలో పూర్తి చేయనున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌కు తప్ప మిగతా వారికి మొబైల్‌ ఫోన్‌ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు ఉంటే తప్ప.. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం 1
1/1

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement