
● రైల్వే గేటు సాకుతో దశాబ్దాలుగా బస్సు నడపలేదు.. ● ఫ్లై
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణం 40 వేలకుపైగా జనాభా కలిగి ఉంది. ప్రముఖ ప్రాంతమైనప్పటికీ, జిల్లా కేంద్రం నుంచి దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. పట్టణానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, రోగులు, వ్యాపారులు కూలీలు నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లివస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. మిగతావారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మందమర్రి మార్కెట్ మీదుగా మంచిర్యాలకు అనుసంధానమయ్యే ఈ మార్గంలో బస్సు సౌకర్యం లేకపోవడం పట్టణవాసులకు పెద్ద సమస్యగా మారింది.
రైల్వే వంతెన పూర్తయినా..
గతంలో రామకృష్ణాపూర్–మంచిర్యాల మార్గంలో రైల్వే గేటు కారణంగా ప్రయాణికులు గంటల తరబడి ఆగాల్సి వచ్చేది. ఇటీవల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రారంభం కూడా జరిగింది. దీంతో దశాబ్దాలుగా లేని ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పట్టణవాసులు భావించారు. కానీ, ఆర్టీసీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
‘మహాలక్ష్మి’ల నిరాశ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, రామకృష్ణాపూర్ పట్టణం నుంచి మంచిర్యాలకు వెళ్లే మహిళలు ఈ సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో, ఈ పథకం ప్రయోజనాలు వారికి చేరడం లేదు. మంచిర్యాల, మందమర్రి మార్కెట్ మీదుగా ఆర్టీసీ బస్సులు కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
చుట్టుపక్కల గ్రామాలపైనా ప్రభావం
రామకృష్ణాపూర్ పట్టణంతోపాటు, చుట్టుపక్కల గ్రామాలైన అమరవాది, సండ్రోనిపల్లె, సారంగపల్లి, తుర్కపల్లి, బీజోన్, ఏజోన్ వంటి ప్రాంతాల ప్రజలు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణానికి నోచుకో వడం లేదు. ఈ గ్రామాల నుంచి జిల్లా కేంద్రం మంచిర్యాలకు రోజువారీగా ప్రయాణించే వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. పట్టనానికి జిల్లా కేంద్రం పది కిలోమీటర్లలోపే ఉన్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ కూడా నష్టపోతోంది.