
రేబిస్తో జాగ్రత్త
● పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం ● సీజన్కు అనుగుణంగా టీకాలు తప్పనిసరి ● నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం
మంచిర్యాలఅగ్రికల్చర్: కుక్కలు, పశువులు, కోళ్లు, పక్షుల నుంచి మనుషులకు సక్రమించేవి జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువుల పాకల అపరిశుభ్రత, తదితర కారణాల వల్ల సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధులపై పశుపోషకులు, జంతు ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలి. దీనిపై అవగాహన కల్పించి, ఆ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి శంకర్ పేర్కొంటున్నారు. పశువుల కాపర్లు, పశు వైద్యులు, కుక్కలు, పక్షులు పెంచేవారు, పశువుల డెయిరీ ఫాంలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు కుక్కలను పెంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుచి, శుభ్రత పాటించడం ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ఇదే రోజు ఎందుకు?
1885 జూలై 6న లూయిస్ ప్యాశచర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తారు.
పిచ్చికుక్క కాటుతో..
పిచ్చికుక్కకాటు వల్ల పశువులు, కుక్క కరిచిన మనుషులకు రేబిస్ సోకుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. పిల్లులు, ముంగిసలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువుల ద్వారా చిట్టెలుక నుంచి ఏనుగు వరకు అన్ని క్షీరదాలకు ఈ వ్యాధి సోకుతుంది. కు క్క కరిచిన తర్వాత 2 నుంచి 3 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి 5 నుంచి 6 నెలల తర్వాత బయటపడుతాయి. కుక్కల ద్వా రా గజ్జి వంటి చర్మ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చికుక్కకాటుకు గురై పశువులు, మనుషులు మృత్యుబారిన పడుతుంటారు. పెంపుడు కుక్కలకు ప్రతీఏటా యాంటీ రేబిస్ వ్యా క్సిన్(ఏఆర్వీ) ఇప్పిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. సీజన్కు అనుగుణంగా పశువులు, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా సకాలంలో వేయించాలి. పెంపుడు కుక్కలకు మొదటిసారి 30వ రోజు, బూస్టర్ డోసు 90వ రోజు టీకాలు వేయించాలి.
సకాలంలో టీకాలు వేయించాలి
వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసాన్ని సరిగా ఉడకని గుడ్డు తినవద్దు. చెడిపోయిన, అపరిశుభ్రంగా ఉన్న పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకోవద్దు. వ్యాధి సోకిన పశువుల పాలు తాగవద్దు. పాడి పశువులు, జంతువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. కాలానికనుగుణంగా పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు రోగ నిరోధక టీకాలు వేయించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూరప్రాంతాల్లో లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి.
అంత్రాక్స్– బ్రూసెల్లోసిస్
పశువుల నుంచి మనుషులకు దొమ్మ(అంత్రాక్స్), బ్రూసెల్లోసిస్ తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. సరిగా వైద్యం చేయిస్తే వ్యాధిని అరికట్టవచ్చు. దీని నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కలుషితమైన పాలు తాగితే క్షయ సోకుతుంది. పందులు, కొంగలు నివాస ప్రాంతాలకు చేరువలో ఉన్నప్పుడు మనుషులు వీటి ద్వారా కూడా మెదడు వాపు సోకవచ్చు. పందులు, దోమలను అరికడితే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.

రేబిస్తో జాగ్రత్త