మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. | Sakshi
Sakshi News home page

మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ..

Published Wed, Mar 29 2023 1:16 AM

-

అక్రమ డిపాజిట్లు..

రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్‌ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్‌ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు.

నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు

చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్‌ రిస్క్‌ అత్యధికంగా ఉండే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌–చైన్నె, మార్గదర్శి చిట్స్‌ (కర్ణాటక) ప్రైవేట్‌ లిమిటెడ్‌–బెంగళూరు, ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్‌ షీట్‌లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్‌ హోల్డర్స్‌ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్‌ షీట్‌లో నోట్‌ నంబర్‌ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్‌ ఆర్బిట్రేడ్‌ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది.

పోంజీ తరహా మోసం..

రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్‌ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది.

చందాదారుల హక్కులకు విఘాతం

రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ మేనేజర్లకు (ఫోర్‌మెన్‌) చట్టప్రకారం ఉండాల్సిన చెక్‌ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారా లు, చెక్‌ పవర్‌ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు.

Advertisement
Advertisement