
వనపర్తి/వనపర్తి టౌన్/వనపర్తి క్రైం: కాలం చేసిన కుటుంబీకుల జ్ఞాపకార్థం నిర్మించిన సమాధులపై రోడ్డు వేసి.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వైనంపై ‘సాక్షి’లో ఈ నెల 25న ‘సమాధులపై రస్తా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తాళ్ల చెరువు ఆధునికీకరణ పేరిట చోటుచేసుకున్న ఈ ఘటన వెలుగులోకి రాగా.. హాట్టాపిక్గా మారింది. రంజాన్ సందర్భంగా ఈ కట్టపైనే శనివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ నలుగురు కలిసినా సమాధులపై రోడ్డు వేయడం ఏమిటనే చర్చ జోరుగా సాగింది. అదేవిధంగా ఆదివారం రోడ్డు కింద కనిపించకుండా పోయిన తమ కుటుంబీకుల సమాధులను చూసేందుకు పలువురు స్వయంగా తరలివచ్చారు. తమ పూర్వీకుల సమాధులు ఇక్కడే ఉండేవంటూ వెతుకుతూ ‘అధికార’ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. సమాధులు ఎక్కడ ఉన్నాయో తెలవడం లేదని.. అభివృద్ధి పేరుతో రోడ్డువేసి రాళ్లతో రివిట్మెంట్ నిర్మించారని.. తమ వారిని స్మరించుకునే అవకాశం లేకుండాపోయిందని బోరుమన్నారు.
ప్రస్తుత, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని మంత్రికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. అప్పుడు అడ్డుకుంటే పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. మా నమ్మకాలను వమ్ము చేయడమే కాకుండా.. మా మనోభావాలను కించపరిచేలా రాజకీయాలు చేస్తున్నారా అంటూ మాపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.