
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో మైక్రో ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వచ్చేలా అందరికీ అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో జెడ్పీ మైదానంలో చిరుధాన్యాల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రవినాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహా ర ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనక ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం గరిష్టంగా రూ.10 లక్షల రాయితీ ఇవ్వనుందని, ఇందుకోసం యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక యువకులు, రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు కరపత్రాలు, బ్రోచర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఇంటర్ పరీక్ష కు
317 మంది గైర్హాజర్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం విద్యార్థులు 8,329 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 8,012 మంది హాజరవగా.. 317 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ వెంకటేశ్వర్లు, స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
పశువుల సంత వేలం రూ.51.06 లక్షలు
దేవరకద్ర: దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పశువుల సంత వేలంపాట శుక్రవారం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన వేలం పాటలో పశువుల సంతను రూ.51.06 లక్షలకు దేవరకద్రకు చెందిన నర్వ శ్రీనివాస్రెడ్డి దక్కించుకున్నారు. అలాగే గొర్రెలు, మేకల సంతను రూ.11.05 లక్షలకు నర్వ శ్రీనివాస్రెడ్డి సొంతం చేసుకున్నాడు. తైబజార్ కూరగాయల సంత వేలం వాయిదా పడింది. తిరిగి శనివారం ఉదయం పంచాయతీ వద్ద నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీఓ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ రామదాసు, ఈఓ సీత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.