
‘స్థానికం’ కోసం.. ‘ముందస్తు’గా..
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్చార్జ్లు
● టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అవకాశం
● వరంగల్కు చిట్ల సత్యనారాయణ, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు
● ఇతర జిల్లాల ఇన్చార్జులుగా ఓరుగల్లు నేతలు
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ‘ముందస్తు’గా సిద్ధమవుతోంది. గ్రామస్థాయినుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆ జాబితాను విడుదల చేశారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్కు నియమించిన టీపీసీసీ చీఫ్.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకు ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్గా చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, మహబూబాబాద్ (ఎస్టీ)కి వైస్ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి, బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములులను నియమించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మల్కాజ్గిరి వైస్ప్రెసిడెంట్గా, హన్మాండ్ల ఝాన్సీరెడ్డికి సికింద్రాబాద్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్ను వైస్ప్రెసిడెంట్గా నియమించిన అధిష్టానం.. ఈవీ శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు భువనగిరి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి సికింద్రాబాద్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని ప్రోగ్రాం ఇప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్గా నియమించారు.
చికిత్స పొందుతూ వినోద మృతి
● కుంటపల్లిలో విషాదఛాయలు●
సంగెం: డబ్బు, ఆస్తి కోసం తల్లిపై పెట్రోల్ పోసి ని ప్పంటించగా ఎంజీఎంలో నాలుగు రోజలు మృత్యువుతో పోరాడిన ముత్తినేని వినోద(60) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. వినోద మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంత రం వినోద మృదేహాన్ని కుంటపల్లి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త సాంబయ్య తలకొరివి పెట్టాడు. కాగా, కన్న కొడుకే కాలయముడై తల్లిని కర్కషంగా బతికుండగానే నరకం చూపించి కాటికి పంపిన సతీశ్ లాంటి కొడుకు పుట్టకపోయినా పర్వాలేదని బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ను పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు.