
రసవత్తరం... చదరంగ సమరం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా చెస్ అసోసియేషన్, స్కాట్స్ పైన్ స్కూల్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చదరంగం క్రీడా సంబరాలు గురువారం రసవత్తంగా సాగాయి. రాష్ట్రంలోని 100 క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్లుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన ఉచిత గ్రాండ్ మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఈ నెల రెండో తేదీన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఇండియా 11వ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రి (గుజరాత్) ఒకే సారి 100 మంది క్రీడాకారులతో చదరంగం క్రీడలో పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వరామంగా ఈ పోటీ కొనసాగింది. టాప్ రేటింగ్ క్రీడాకారులు కొల్ల భావన్(ఎన్టీఆర్ జిల్లా), కె.సందీప్ (కృష్ణా జిల్లా), సి.హెచ్.అనయ్య (రాజమండ్రి), వి.హర్షవర్ధన్ (నంద్యాల)తో పాటు 1600 నుంచి 1800 లోపు రేటింగ్ ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనటంతో పోటీ హోరాహోరీగా సాగింది. చదరంగ క్రీడాకారులను తయారు చేసేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న ఆంధ్రా చెస్ అసోసియేషన్ను, సహకరిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని బక్రి అభినందించారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి సాయిపావని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ పాల్గొన్నారు.