
కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెల్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కిలేశపురం వద్ద నందిగామ నుంచి మచిలీపట్నం వెళ్తున్న కారును ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని కారు ఢీకొట్టడంతో రెండు వాహనాల మద్య కారు ఇరుక్కు పోయింది. కారులో ఉన్న నందిగామకు చెందిన ఆదిశేషు, పుష్పావతి వారి కుమారుడు సాయి శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమార్తె హర్షిత, డ్రైవర్ రాంబాబుకు పెద్దగా గాయాలు కాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. బస్సును పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన మూడు బైకులను బస్సు డ్రైవర్ ఢీకొట్టి మరో ప్రమాదానికి కారణమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.