
వక్ఫ్ భూములకు న్యాయం జరిగేనా..?
పెనమలూరు: కొండపల్లి ఖాజీకి చెందిన వక్ఫ్ భూములకు మోక్షం లభిస్తుందనే ఆశతో ముస్లిం మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. గత 25 ఏళ్లుగా వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేసిన ఆక్రమణదారులు నయాపైసా కౌలు చెల్లించక పోవటంతో పేద ముస్లింల సఃక్షేమం జరగలేదు. సుదీర్ణ పోరాటం తరువాత ఈ నెల 11వ తేదీన వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయనున్నారు. కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇనామ్ భూములు వక్ఫ్ పరిధిలో ఉన్నాయి. పెదపులిపాక గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 12.59 ఎకరాలు, తాడిగడప గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 79లో 13.41 ఎకరాలు, 173లో 4.08 ఎకరాలు, 176లో 12.92 ఎకరాలు కలిపి మొత్తం 43 ఎకరాలు భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో భూముల ధర రూ.300 కోట్లకు పై మాటే. 43 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారు ఖాజీకి గాని, వక్ఫ్ బోర్డుకు గాని నయాపైసా కౌలు చెల్లించలేదు. దీంతో పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. దీనిపై వక్ఫ్ బోర్డు, కొండపల్లి ఖాజీ పోరాట బాట పట్టారు. హైకోర్టు కూడా వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయాలని ఆదేశించింది. వేలం నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులు జాప్యం చేశారు. చివరకు ప్రభుత్వం కూడా ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించే యత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూములకు కౌలు వేలంపాట నిర్వహించనున్నారు. వేలం నగదు రూపంలో ముందుగానే చెల్లించాలి. పాటదారులు రూ 50 వేలు డిపాజిల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆక్రమణదారుల చెరలో భూములు న్యాయం కోసం ఎదురు చూస్తున్న పేద ముస్లింలు ఈ నెల 11వ వేలం పాట