తవ్వుకో తమ్ముడూ! | - | Sakshi
Sakshi News home page

తవ్వుకో తమ్ముడూ!

Jun 6 2025 7:34 AM | Updated on Jun 6 2025 7:34 AM

తవ్వుకో తమ్ముడూ!

తవ్వుకో తమ్ముడూ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో

ఆగని ఇసుక దందా

లారీకి రూ.10వేలు కడితేనే లోడింగ్‌

నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దోపిడీ

తెలంగాణకు అక్రమంగా తరలింపు

పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి

అనుచరుల అండతోనే అంతా

పామర్రు, పెనమలూరు

నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు

ఇసుక దందాను చూసీ

చూడనట్లు వదిలేస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత ఇసుక పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఇసుక రీచ్‌లను గుప్పెట్లో పెట్టుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇసుక రీచ్‌లో లారీకి రూ.7 నుంచి రూ.10 వేలు చెల్లిస్తేనే లోడింగ్‌ చేస్తున్నారు. లారీకి 40 టన్నుల చొప్పున ఇసుకను ఓవర్‌ లోడ్‌ చేసి తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రోజుకు వందల లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ జిల్లా సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీకి మైనింగ్‌, రెవెన్యూ, పోలీసులు అధికారులు దగ్గరుండి పచ్చ జెండా ఊపుతున్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు పెట్టామని, డ్రోన్‌లతో పర్యవేక్షణ చేస్తున్నామని, టోల్‌గేట్ల వద్ద నిఘా పెట్టామని అధికారులు గొప్పలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే, ఇవన్నీ బూటకపు మాటలేనని స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్‌లు ఉన్నా ప్రాంతాల ప్రజలను ఎవ్వరినీ కదిపినా అక్కడ జరిగే దందాను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. పేరుకు ఉచిత ఇసుక అని చెప్పడం తప్ప, రీచ్‌ వద్ద మాత్రం వారి చెప్పినంతా డబ్బు కట్టాల్సిందేనని వివరిస్తున్నారు. లేకపోతే వారికి ఇసుక లోడింగ్‌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు వాపోతున్నారు. కొంత మంది ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.

పక్కదారిలో పక్క రాష్ట్రానికి..

నందిగామ, జగ్గయ్యపేట ప్రాంత ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్‌ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం తదితర ప్రాంతాల్లో రూ. 75వేలు ఉండగా హైదరాబాద్‌లో రూ. లక్ష వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు..

ఆపేదెవరూ.. అడ్డొచ్చేదెవరు?

కృష్ణా జిల్లాలో అడ్డూ అదుపూ లేకుండా..

కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇక్కడ ఉన్న రీచ్‌లను కూటమి ప్రజా ప్రతినిధులు పంచుకున్నారు. పెనమలూరులోని చోడవరం రీచ్‌ నుంచి అనధికారికంగా నియోజక వర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. లారీ లోడింగ్‌కు రూ.8వేలకు పైగా వసూలు చేస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్‌ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధి, రోజుకు వందల లారీలను పోర్టు పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్‌ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకోవడం గమనార్హం. పామర్రు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్‌ వచ్చింది. ఈ రీచ్‌ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 300కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్‌ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌లన్నింటినీ పచ్చనేతలు తమ కనుసన్నల్లో ఉంచుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీంతో పాటు చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement