ముగిసిన చెస్‌ క్రీడా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెస్‌ క్రీడా సంబరాలు

Jun 7 2025 1:49 AM | Updated on Jun 7 2025 2:33 PM

విజయవాడస్పోర్ట్స్‌: విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌ పైన్‌ స్కూల్‌లో ఐదు రోజులుగా జరుగుతున్న చదరంగం క్రీడా సంబరాలు శుక్రవారం ముగిశాయి. ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌, స్కాట్స్‌ పైన్‌ స్కూల్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు, గ్రాండ్‌మాస్టర్‌ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇండియన్‌ 11వ గ్రాండ్‌మాస్టర్‌ తేజస్‌బక్రి(గుజరాత్‌) ద్వారా రాష్ట్రంలోని 100 మంది జాతీయ స్థాయి చెస్‌ క్రీడాకారులకు గ్రాండ్‌ మాస్టర్‌ కోచింగ్‌ ఇప్పించారు. ఈ కోచింగ్‌కు హాజరైన క్రీడాకారులకు సర్టిఫికెట్‌లను, మెమెంటోలను అందజేశారు. ముగింపు కార్యక్రమంలో స్కూల్‌ సీఈవో కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్‌ చలసాని ప్రతిమ, ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌, కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్‌.ఎం.ఫణికుమార్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ డైరక్టర్‌ పి.రేణుక, గ్రాండ్‌ మాస్టర్‌ తేజస్‌ బక్రి పాల్గొన్నారు.

దొనబండ వద్ద లారీ బీభత్సం

దొనబండ(ఇబ్రహీంపట్నం): మండలంలో దొనబండ గ్రామ సచివాలయం సమీపంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ వైపు నుంచి 65వ నంబర్‌ జాతీయ రహదారిపై వస్తున్న లారీ దొనబండ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ముందుగా రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం నేలకూలింది. అంతటితో ఆగక ముగ్గురమ్మల ఆలయం స్వాగత ద్వారం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సింహం విగ్రహంతో పాటు దిమ్మె పాక్షికంగా ధ్వసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పరిణామాలు చూసిన సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీ కయాకింగ్‌ పోటీలు ప్రారంభం

మచిలీపట్నంటౌన్‌: మంగినపూడి బీచ్‌ వద్ద శుక్రవారం నెలకొన్న ఆహ్లాదకర వాతావరణంలో, సందర్శకుల మధ్య 3వ జాతీయ సీ కయాకింగ్‌, స్టాండప్‌ పెడలింగ్‌ చాంపియన్‌ షిప్‌ –2025 పోటీలు వేడుకగా ప్రారంభమయ్యాయి. జాతీయ కయాకింగ్‌ పోటీలను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కెనోయింగ్‌ అండ్‌ కయాకింగ్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొదట 14 ఏళ్ల బాలుర 500 మీటర్ల కయాకింగ్‌ విభాగంలో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన సౌరబ్‌ సాహు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన రియాజ్‌ ఖాన్‌, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ వరుసగా తొలి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. బాలికల 14ఏళ్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చరిత శ్రీ, మహారాష్ట్రకు చెందిన సాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిత తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

యుద్ధప్రాతిపదికన పనులు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బుడమేరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వెలగలేరు వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌, పులివాగు, బుడమేరు డైవర్షన్‌ చానల్‌, శాంతినగర్‌ వద్ద అభివృద్ధి పనుల ప్రాంతంలో అధికారులతో కలసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఇప్పటికే చేపట్టిన పనులు, వాటిలో పురోగతి, గండ్లు పడిన ప్రాంతాల మ్యాపులు పరిశీలించారు. చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో కావూరి చైతన్య, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆర్‌ మోహనరావు, విజయవాడ డివిజన్‌ ఈఈ గంగయ్య తదితరులు ఉన్నారు.

ముగిసిన చెస్‌ క్రీడా సంబరాలు 1
1/1

ముగిసిన చెస్‌ క్రీడా సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement