గిరిజనుల సొంతింటి ‘కల’! | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సొంతింటి ‘కల’!

Nov 25 2025 10:26 AM | Updated on Nov 25 2025 10:26 AM

గిరిజనుల సొంతింటి ‘కల’!

గిరిజనుల సొంతింటి ‘కల’!

● సిర్పూర్‌(టి) మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మేడిపల్లి, రావన్‌పల్లి, లింబుగూడ గ్రామాలుండగా.. మూడు గ్రామాలకు కలిపి మొత్తం 154 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. రావన్‌పల్లిలో కేవలం ఏడు ఇళ్లు బేస్‌మెట్‌ స్థాయి వరకు మాత్రమే కట్టారు. ● సిర్పూర్‌(టి) మండలం వేంపల్లి గ్రామ పంచాయతీలోని కొలాంగూడ గ్రామంలో 26 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనా అటవీ అధికారులు అభ్యంతరం తెలపడంతో పనులు ప్రారంభించడం లేదు. ● బెజ్జూర్‌ మండలం సుశ్మీర్‌ గ్రామంలో 20 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ● పెంచికల్‌పేట్‌ మండలం అగర్‌గూడ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. ● కౌటాల మండలకేంద్రంలోని సదాశివ్‌పేట్‌ ఎస్సీ కాలనీకి చెందిన 30 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది.

ఇళ్లు మంజూరైనా అనుమతులు రాక సాగని పనులు నిర్మాణాలు అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు తప్పని ఎదురుచూపులు

సిర్పూర్‌(టి): జిల్లాలోని గిరిజనులకు సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన గిరిజన పల్లెల్లో అటవీశాఖ నిబంధనలు అడ్డుగా మారాయి. అటవీశాఖ పరిధిలో గ్రామాలు ఉన్నాయని, రిజర్వ్‌ ఫారెస్ట్‌ అంటూ అధికారులు పనులు అడ్డుకుంటున్నారు. దశాబ్దాలుగా నివాసముంటున్న వారు అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు మంజూరై నెలలు గడుస్తున్నా జిల్లాలోని పలు గ్రామాల్లో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

‘పైలెట్‌’ గ్రామంలోనూ..

సిర్పూర్‌(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత కంటే ముందే పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు మంజూరు కావడంతో గ్రామస్తులు సంబురపడ్డారు. ఎంతో ఆశగా నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే అటవీశాఖ అధికారులు నిర్మాణ పనులు నిలిపివేశారు. ఒకవైపు ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఎంపిక చేస్తే.. మరోవైపు అధికారులు గ్రామం అటవీశాఖ పరిధిలో ఉందంటూ అడ్డుకోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి జీపీ పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని అటవీశాఖ అధికారులు, ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వేలు నిర్వహించారు. సర్వే రిపోర్టులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, కౌటాల మండలాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement