పల్లెల్లో మళ్లీ సందడి!
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయంతో మళ్లీ జిల్లాలోని గ్రామాల్లో సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గత నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పుతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు డీఆర్ఆర్డీ శాఖ కోర్టుకు తెలియజేస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.
335 పంచాయతీలు
జిల్లాలో 335 గ్రామ పంచాయతీల్లో 2,874 వార్డులు ఉన్నాయి. 3,53,895 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 345 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముందుగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత జిల్లాలోని 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా.. తాజాగా నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం లోబడి ఉండనున్నాయి. బీసీల రిజర్వేషన్ల శాతం 27కు తగ్గే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయోననే ఉత్కంఠ ఆశావహుల్లో ఉంది. 2016లో తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించగా, గత నెలలో నోటిఫికేషన్లో బీసీ జనరల్కు కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఏ వర్గాన్ని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.


