విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
హొసపేటె: విజయపుర జిల్లా కూడ్లిగి తాలూకాలోని శివపుర గొల్లరహట్టి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిరంతరం సామాజిక సేవల్లో పాల్గొంటోంది. అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు కీర్తిని తీసుకు వచ్చినందున విద్యార్థులకు ఉచిత బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కోగళి కొట్రేష్, ట్రస్ట్ అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: ద్విచక్రవాహనంతో వంతెనను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి సింధనూరు–మస్కి రహదారిలో భూతలదిన్ని వద్ద నిర్మాణ దశలో ఉన్న వంతెనను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులను యల్లప్ప(24), లింగప్ప(27)లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనపరచుకుని శవ పరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హీరోహోండా ద్విచక్రవాహనం అదుపు తప్పి వంతెన వద్ద ఇనుపరాడ్డుకు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.
హనుమాన్ జయంతి వేడుకలు
చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె నగర సమీపంలోని కరేకల్ శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. విద్వాన్ నాగశయన గౌతమ్ నేతృత్వంలో ఉదయం స్వామి వారికి వేద మంత్రాలతో పంచామృతాభిషేక అలంకరణ, మహామంగళ హారతి జరిగింది. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దివంగత పద్మనాభ శెట్టి కుమారులు అన్నసంతర్పణ జరిపారు. సాయంత్రం సమయంలో చైత్ర ఆధ్వర్యంలో భక్తిగీతాలాపన చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రకాష్ శర్మ, ఎల్ఐసీ శ్రీనాథ్, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో దివ్యాంగులకు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె సోమవారం కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం పన్నుల నుంచి దివ్యాంగులకు సెల్కో సంస్థ నుంచి కిట్లను అందించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో సెల్కో సంస్థ అందించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సౌర ఆధారిత యంత్రాల ద్వారా జీవనోపాధి యంత్రాలను అందించిన సంస్థలను అభినందించారు. కార్యక్రమంలో సెల్కో సంస్థ పదాధికారులు ఆనంద్, శివరాజ్, రఘునాథ్లున్నారు.
సమాజాభివృద్ధికి
సహకరించాలి
రాయచూరు రూరల్: బంజార సమాజం అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆ సమాజం అధ్యక్షుడు విజయ్ జాధవ్ పేర్కొన్నారు. సోమవారం జేసీ భవనంలో నూతన పదాధికారుల ప్రమాణ వచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. బంజార సమాజం తాండాల్లో నివాసముంటూ కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉందన్నారు. నేడు మన పిల్లలను సామాజికంగా, విద్యా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గోవిందరాజ్, అమరేష్, కృష్ణప్ప, సీతారామ నాయక్, వెంకప్ప, లాలప్ప, శివణ్ణ పవార్, హన్మంతు, వెంకటేష్, జ్యోతిలున్నారు.
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ


