
మహా వరదలకు ఆల్మట్టి కారణం కాదు
● తేల్చిన నీటిపారుదల శాస్త్రవేత్త కమిటీ బృందం
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంభిస్తోందన్న ఆరోపణలతో గురువారం ఓ కమిటీ పర్యటించింది. మహారాష్ట్ర నీటిపారుదల శాస్త్రవేత్త నందకుమార్ కమిటీతో కూడిన సభ్యులు ఆల్మట్టి డ్యాంను సందర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు.బ బచావత్ తీర్పు మేరకు ఎత్తు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా భాగ్య జల నిగమ మండలి అధికారులు, మహారాష్ట్ర నీటిపారుదల శాస్త్రవేత్త కమిటీ సభ్యులు జలాశయంలోకి వస్తున్న నీటి నిల్వ, ఎంత మేర వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మహారాష్ట్రకు వరదలు రావడానికి కర్ణాటక జలాశయాలు కారణం కాదని తేల్చారు. నదీ తీర ప్రాంతంలో అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో వరదల సమయంలో పల్లెలు, వాగులు, వంతెనలు కొట్టుకు పోతాయన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కార్కు 2020లో నివేదికను అందించినట్లు తెలిపారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు సభ్యుడు బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఆనకట్ట ఎత్తు పెంచితే సాంగ్లీ, కోల్హాపూర్, మీరజ్ జిల్లాలు వరదలకు గురి కావడం తథ్యమనే విషయాన్ని తోసిపుచ్చారు. ఆల్మట్టి డ్యాం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి నందకుమార్ ఆధ్వర్యంలోని సంజయ్ ఘనేకర్, ఆర్ఆర్ పవార్, ప్రదీప్ పురందర్, అతుల్ కపూలే, ఆర్డీ మోహితె, ఎస్ఎల్ దయాపూర్, ఎస్.ఎస్.ఖరే, ధైర్యశీల పవార్లున్నారు.