
వృక్ష సంపదను పరిరక్షించాలి
బళ్లారిఅర్బన్: నగరంలో పచ్చదనం పెంపొందించే దిశగా వృక్ష సంపదను పరిరక్షించాలని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీవీ సంఘం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పర్యావరణ సంరక్షణతో పాటు పరిసరాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు కృషి చేయాలన్నారు. నగరంలో ప్రతి ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెట్లను పరిరక్షించుకొనే అలవాటు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. విద్యార్థులు పాఠాలతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉంటే అలాంటి వారి వ్యక్తిత్వం చక్కగా రూపుదిద్దుకుంటుందన్నారు. కళాశాల పాత విద్యార్థులు సంఘం సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షనీయం అన్నారు. పాత విద్యార్థులు నారా శరత్రెడ్డి, రత్నరెడ్డి, ఇర్ఫాన్, టిల్లు తదితరుల కృషిని ఆయన అభినందించారు. విద్యార్థులకు పాఠాల బోధనతో పాటు వారి ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రేరణ ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు. పాలికె ఈఈ మల్లనగౌడ మాట్లాడుతూ సామాజిక స్పృహతో నగరంలో నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాత విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మియాఓకి ఫారెస్ట్ తరహాలో ఓ ఎకరా స్థలంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ అధికారి శరణ్కుమార్, కార్పొరేటర్ నూర్ మహమ్మద్, కణేకల్ మహంతేష్, కళాశాల పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె బసవరాజ్, చానాళ్ శేఖర్, యాళ్పి పంపనగౌడ, చోరనూరు కొట్రప్ప, బీఆర్ఎల్ శీన, పల్లెద ప్రభులింగ, కోరి విరుపాక్షప్ప తదితరులు పాల్గొన్నారు.