సెంట్రల్‌ జైలులో నిందితుల రాద్ధాంతం | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలులో నిందితుల రాద్ధాంతం

May 29 2025 1:15 AM | Updated on May 29 2025 1:15 AM

సెంట్

సెంట్రల్‌ జైలులో నిందితుల రాద్ధాంతం

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని జైళ్లలో పేరుగాంచిన, బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన అప్పటి సెంట్రల్‌ జైలులో నిందితుల గొడవలు, రాద్ధాంతాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో పాటు, అందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని సెంట్రల్‌ జైలులో ఓ హత్య కేసులో నిందితులు లేనిపోని సాకులు చూపుతూ జైలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. శివమొగ్గలో ఇటీవల జరిగిన భజరంగదళ్‌ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులను బళ్లారి సెంట్రల్‌ జైలులో ఉంచారు. అయితే వీరి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ జైలు సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జైలులోని నిందితుల ఆగడాలు, కిరికిరి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జైలు ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోక తికమక పడుతున్నారు.

రోజూ ఏదో సాకుతో గొడవ

ఈ కేసులో నిందితులు జిలాన్‌, సయ్యద్‌ నిహాల్‌ అనే ఇద్దరు జైలులో రోజుకు ఒకటి చొప్పున సమస్యను సాకుగా చూపుతూ జైలు సిబ్బందిని వేధిస్తున్నారు. ఇటీవల ఈ వివాదం పతాక స్థాయికి చేరడంతో సిబ్బంది, నిందితుల మధ్య వాగ్వాదం జరిగిన కీలక వీడియో దృశ్యాలు వైరల్‌ కావడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హర్ష హత్య కేసులో నిందితుడైన జిలాన్‌ను ఇంతకు ముందు కలబుర్గి జైలులో ఉంచారు. అయితే కలబుర్గి జైలులో వసతులు సరిగా లేవని, అతడు ధార్వాడ జైలుకు మార్చుకున్నారు. అక్కడ కూడా వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేసి, మరొక చోటకు తరలించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే జిలాన్‌ను బళ్లారి సెంట్రల్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. జిలాన్‌కు బళ్లారి జైలు వసతులు మింగుడు పడటం లేదు. ఈ కేసులో మరో నిందితుడు సయ్యద్‌ నిహాల్‌ను జిలాన్‌ కన్నా ముందే బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

అధికారులు, సిబ్బందికి దినదిన గండం

మొత్తం మీద ఈ ఇద్దరు నిందితులు ఒకచోట చేరడంతో మొత్తం సీన్‌ మారింది. జైలు అధికారులు, సిబ్బంది రోజుకు గండంలా తయారైంది. తమను ప్రత్యేకంగా ఉంచరాదని, అందరితో పాటు ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య ఖైదీలుగా ఉండేందుకు తమను వదలాలని, లేదా వేరే జైలుకు మార్చాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నట్లు, అది కూడా న్యాయవాది ద్వారాా చెప్పించేవారు. జైలు పాలనా నియమాలు వీటిని అంగీకరించకపోవడంతో ఉన్నఫళంగా వారికి వారే గొడవ పెట్టుకుని రాద్ధాంతం సృష్టించారని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఇద్దరు ఏదో విషయమై రాద్ధాంతం సృష్టించినట్లు తెలియడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. గొడవల నేపథ్యంలో ఇద్దరిపీ వేర్వేరు సెల్‌లో ఉంచామని జైలు అధికారులు తెలిపారు. కాగా శివమొగ్గ హర్ష, దక్షిణ కన్నడ ప్రవీణ్‌ నెట్టార్‌ హత్య కేసుల్లోని నిందితులు కూడా బళ్లారి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. వీరందరినీ సాధారణ ఖైదీలుగా ఉంచామని జైలు అధికారులు తెలిపారు.

సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

అధికారులకు తలనొప్పిగా మారిన వైనం

సెంట్రల్‌ జైలులో నిందితుల రాద్ధాంతం1
1/1

సెంట్రల్‌ జైలులో నిందితుల రాద్ధాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement